ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ‘సిటా’ సర్వర్ ఈ తెల్లవారుజాము మూడు గంటల నుంచి పనిచేయడం మానేసింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళ్తాయో తెలియక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిరిండియా ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు.
ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో అయితే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముంబాయి ఏయిర్ పోర్టులో సుమారు రెండు వేల మంది ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. ప్రయాణీకులు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎయిరిండియాపై దుమ్మెత్తి పోస్తున్నారు.
పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
దీనిపై స్పందించిన ఎయిరిండియా తమ సాంకేతిక సిబ్బందితో సమస్యను పరిష్కరించే పనిలో వున్నారని పేర్కొంటూ, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది.
మెయిన్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది.
ఈ విషయంపై ఆ సంస్థ సిఎండి అశ్వనీ లోహని మాట్లాడుతూ సర్వర్ను పునరుద్ధరించామని చెప్పారు. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగిందని అశ్వనీ తెలిపారు. సాంకేతిక నిపుణుల బృందం డౌన్ అయిన సర్వర్ ను పునరుద్ధరించిందని అశ్వనీ వివరించారు.
https://twitter.com/i/status/1121946875924336640