అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ అతి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. మరో 12 గంటల్లో పెనుతుపానుగా, మరో 24 గంటల్లో అతితీవ్ర పెనుతుపానుగా మారే అవకాశాలున్నట్లు వారు తెలిపారు.
నాలుగొవ తేదీన ఈ పెను తుపాను ఒడిశా తీరం దాటి పశ్చిమబెంగాల్ దిశగా పయనిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఫొని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
పెను తుపాను గమన ప్రాంతంలో గంటకు 170కి.మీ. నుంచి 200 కి.మీ.తో భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో మంగళవారం రాయలసీమ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. రెండొవ తేదీన ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ వేగంతో, మూడొవ తేదీకల్లా గంటకు 60-85 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.
తుపాను నేపథ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మంగవారం ఉదయం నుంచి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు.
అలాగే మే ఒకటి నుంచి మూడొవ తేదీ వరకూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మే రెండు నుంచి నాలుగొవ తేదీ వరకూ వాయువ్య బంగాళాఖాతంలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీ వరకూ దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి పరిసరాల్లో ఈ పరిస్థితులు కొనసాగుతాయనీ, అలాగే మే రెండు నుంచి నాలుగొవ తేదీ వరకూ ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సముద్రం కల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమయంలో చేపల వేటను నిషేధించారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
కాగా, తుఫాను సహాయక చర్యల నిమిత్తం కేంద్రం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్ డి ఆర్ ఎఫ్) నుంచి ఈ మేరకు నిధులు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు 200.25 కోట్ల రూపాయలు, ఒడిశాకు 340.87 కోట్ల రూపాయలు, తమిళనాడుకు 309.37 కోట్ల రూపాయలు, పశ్చిమ బెంగాల్ కు 233.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తుఫాను సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తు నిధిగా ఈ డబ్బును ఇస్తున్నట్టు పేర్కొంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలనీ, తుపాను బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.