అమరావతి: ఫొని తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ఫొని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబుతో విపత్తుల ప్రత్యేక అధికారి వరప్రసాద్, ఆర్టిజిఎస్ సిఇఒ అహ్మద్ బాబు తెలియజేశారు. 120 క్యాంప్లను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.
టెక్కలి, పలాస కేంద్రాల్లో సహాయ బృందాలు అందుబాటులో ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. అదే విధంగా పాలు, త్రాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పాఠశాలల్లో తలదాచుకునే తుఫాను బాధితులకు అహారం, ఇతర వసతులు కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు.
విశాఖ కేంద్రంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు పంపించాలని సూచించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు చంద్రబాబు ఫోన్ చేసి తుఫాన్ పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో తుఫాను విపత్తు సమయంలో 30కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఒడిశాకు పంపించిన విషయాన్ని అధికారులకు చంద్రబాబు గుర్తు చేశారు.