లండన్: భారత సంతతికి చెందిన రొమాంటిక్ మోసగాడికి యూకే కోర్టు ఆరేళ్ల ఒక నెల జైలుశిక్ష్ విధించింది. ఆరుగురు మహిళలను మోసం చేసి, వారితో కాగితాల మీదే ఉన్న కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టించినందుకు ఈ శిక్ష విధించారు. కేయూర్ వ్యాస్ (32) తూర్పు లండన్ ప్రాంతానికి చెందినవాడు. ఇతడి మోసాలపై స్కాట్లాండ్ యార్డు పోలీసులు నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా దర్యాప్తుచేశారు.
వ్యాస్ ముందుగా ఆన్ లైన్ లో మహిళలతో సంబంధం ఏర్పరుచుకుని, వారితో డిన్నర్లు చేసేవాడు. ఎర్రగా బుర్రగా ఉండటంతో అతడి మాటలకు వారు పడిపోయేవారు. తర్వాత వారందరితో కలిపి దాదాపు రూ. 8 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించాడు. వాళ్ల నమ్మకం పొందిన తర్వాతే అతడు అసలు లేని కంపెనీలలో వారితో డబ్బులు పెట్టించినట్లు మెట్ పోలీసు సెంట్రల్ స్పెషలిస్ట్ కమాండ్ డిటెక్టివ్ ఆండీ చాప్ మన్ తెలిపారు. వాళ్లతో నకిలీ కాంట్రాక్టులు కుదుర్చుకునేవాడని, కానీ వాళ్లు మాత్రం అతడితో ఉన్న సంబంధాల వల్లే పెట్టుబడి పెట్టారని చెప్పారు. ఈ విషయంలో వ్యాస్ చాలా స్వార్ధంతోను, క్రూరంగాను వ్యవహరించాడని అన్నారు. 2014 అక్టోబరు నెలలో ఇతడి విషయం పోలీసులకు తెలిసింది.
మహిళలతో స్నేహం చేసి, వారిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తానని అందరికీ చెప్పేవాడు. నమ్మకం కుదిరిన తర్వాత పెట్టుబడి రూపంలో పెద్దమొత్తాలు వాళ్ల నుంచి లాగేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా తమ డబ్బు వెనక్కి తిరిగి రాకపోవడంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మోసం చేసినందుకు నాలుగు కౌంట్లు, జీవితం గురించి అబద్ధాలు చెప్పినందుకు మరో రెండు కౌంట్లు దోషిగా వ్యాస్ తేలాడు. దాంతో అతడికి ఆరేళ్ల జైలుశిక్ష విధించారు.