న్యూఢిల్లీ: పైన చెప్పిన పేర్లన్నీ ఎక్కడో విన్నట్లు అనిపిస్తోందా? వాళ్లెవరో మీకు బాగా తెలిసినవాళ్లు అనుకుంటున్నారా? అలనాటి బాలీవుడ్ నటీమణులవి కావచ్చు గానీ, ఆ పేర్లు మాత్రం అత్యంత భయానకమైన తుపాన్లవి. ఒడిశా తీరాన్ని దాటి విధ్వంసం సృష్టించిన ఫొని తుపాను పేరును బంగ్లాదేశ్ సూచించింది. ఇపుడది ఆ దేశానికే వెళ్తోంది. ఫోని అంటే బంగ్లాలో పాము పడగ అని అర్థమని భారత వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహాపాత్ర తెలిపారు. అసలు తుపానులకు ఈ పేర్లు ఎలా పెడతారో తెలుసా? ఒమన్ లోని మస్కట్ నగరంలో 2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ వాతావరణ సంస్థ సదస్సులో తుపానులకు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో వచ్చేవాటికి ఈ పేర్లు పెడుతున్నారు. 2004 సెప్టెంబరు నుంచి ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపానులకు సభ్యదేశాలన్నీ పేర్లను సూచించడం మొదలైంది.
బంగ్లాదేశ్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్ లాండ్.. ఈ ఎనిమిది దేశాలు ముందుగానే కొన్ని పేర్లను ఎంపికచేసి ఇచ్చేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆయా పేర్లను వరసుగా వచ్చే తుపానులకు పెడతారు. జాబితాలో తొలి పేరుగా బంగ్లాదేశ్ ‘ఒనిల్’ అనే పేరు చూసించింది. ఇది అరేబియన్ సముద్రంలో 2004 సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్య సంభవించింది. థాయ్ లాండ్ పేరుపెట్టిన ఫెథాయ్ తుపాను బంగాళాఖాతంలో మొదలై ఆంధ్రప్రదేశ్ లో గత డిసెంబరులో అల్లకల్లోలం సృష్టించింది. తర్వాత భారతదేశం పెట్టిన పేరు వాయు. ఇలా మొత్తం 8 దేశాలు కలిపి 64 పేర్లు సూచించగా వాటిలో 57 అయిపోయాయి. భారతదేశం సూచించిన పేర్లలో అగ్ని, జలి, బిజిలీ, ఆకాష్ లాంటి పేర్లుండగా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు మాలా, హెలెన్, నీలోఫర్ లాంటి పేర్లు సూచించాయి.
తుపానులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి వాటి పేర్లను మళ్లీ మళ్లీ పెట్టరు. ఒకవేళ ప్రజలు ఎవరైనా తుపానులకు పేర్లు సూచించాలనుకుంటే దానికి సంబంధించిన ప్రాథమిక నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఉత్తర హిందూ మహాసముద్రంలో తుపానులకు పేర్లు పెట్టే విషయంలో ఒక సర్క్యులర్ జారీచేశారు. పేరు చిన్నగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అవి సాంస్కృతికంగా సున్నితమైనవి కాకూడదు. ఎవరినీ కించపరిచే పేర్లు కాకూడదు. ఆ పేరును వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కు పంపచ్చు.
తుపానులకు పేర్లు పెట్టే విధానాన్ని తొలుత అమెరికాలో ప్రారంభించారని వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. అంతకంటే ముందు తుపాను తీరం దాటిన తర్వాత దానికి పేరు పెట్టేవారన్నారు. మొదట్లో అన్నీ ఆడపేర్లే పెట్టేవారని, తర్వాత ఒక పద్ధతి ప్రకారం పెట్టడం మొదలుపెట్టారని ఐఎండీ వివరించింది. 1900 చివరికి ముందు మగ పేర్లు రావడం మొదలయ్యాయి.