భోపాల్: భోపాల్ లోక్సభ బిజెపి అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అయ్యారు. అయితే ఆ తర్వాత కాస్సేపటికే బిజెపి ఆదేశం మేరకు క్షమాపణ చెప్పారు.
నాథూరాం గాడ్సే దేశభక్తుడనీ, ఆయన దేశ భక్తుడిగానే దేశ ప్రజల్లో మిగిలిపోతారనీ వ్యాఖ్యానించారు. గాడ్సేను ఉగ్రవాదిగా పిలిచే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో దీటుగా బదులిస్తారని కూడా ప్రజ్ఞా అన్నారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించడంతో బిజెపి నష్టనివారణకు వెంటనే చర్యలు చేపట్టింది. సాధ్వి వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఆమె అలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని ప్రకటించింది. తప్పనిసరి కావడంతో ప్రజ్ఞా సింగ్ క్షమాపణలు చెప్పారు
మహత్మా గాంధీని హత్య చేసిన నాధూరామ్ గాడ్సే దేశంలో తొలి హిందూ ఉగ్రవాదని ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం, కేసుల నమోదు వరకూ వెళ్లడం తెలిసిందే.
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఇప్పుడు సాధ్వి చేసిన వ్యాఖ్యలు మరో సారి వివాదాస్పదం అయ్యాయి. ఇంతకు ముందు హేమంత్ కర్కరేపై, బాబ్రీ మసీదు కూల్చివేత అంశంపై సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
కాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఆమె చేసిన వ్యాఖ్యలతో బిజెపి ఏకీభవించదనీ, ఈ వాఖ్యలపై ఆమె నుండి పార్టీ వివరణ కోరుతుందని జివిఎల్ తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సాధ్వి బహిరంగ క్షమాపణ చెప్పాలని జివిఎల్ కోరారు.
సాధ్వి వ్యాఖ్యలు వినండి:
#WATCH BJP Bhopal Lok Sabha Candidate Pragya Singh Thakur says 'Nathuram Godse was a 'deshbhakt', is a 'deshbhakt' and will remain a 'deshbhakt'. People calling him a terrorist should instead look within, such people will be given a befitting reply in these elections pic.twitter.com/4swldCCaHK
— ANI (@ANI) May 16, 2019
Video Courtesy: ANI