తుఫానుపై విజయం, సముద్రంపై కంట్రోల్ చేశామంటున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో అని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు చర్యలను తూర్పారబట్టారు. పెథాయ్ తుఫాను వచ్చి జనం బిక్కుబిక్కు మంటుంటే బాబు రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్లి రాజకీయం చేస్తారన్నారు. తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోని బాబు ప్రచారం మాత్రం చాలా బాగా చేసుకున్నారని అన్నారు. తుఫాను నష్టం రూ.3,435కోట్లలో 15శాతం కూడా ఇవ్వకుండా సిగ్గు లేకుండా తుఫానుపై విజయం సాధించామని మాట్లాడుతున్నారని అన్నారు.
కొత్త క్వారీలకు లైసెన్సు కావాలంటే ఇక్కడ మంత్రికి రూ. 25 లక్షలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. టెక్కలిలో మంత్రి అనుచరులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి గోడౌన్లు కట్టుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గం నుండి గెలిచి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు వేపకాయంత మేలు కూడా చేయలేదని విమర్శించారు. 1994లో టెక్కలి నుండి గెలిచిన ఎన్టిఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును నేటి వరకూ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని అన్నారు.