న్యూఢిల్లీ: ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్న ఉన్నావ్ అత్యాచారం బాధితురాలి కథలో నిర్ఘాంతపరిచే వాస్తవాలు ఒక్కొ కటిగా బయటకు వస్తున్నాయి. ఆమెపై తాను అత్యాచారం చేయడమే కాకుండా తన అనుచరులకు కూడా అప్పగించిన ఆభియోగంపై జైలులో ఉన్న బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ అక్కడినుంచే బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం దగ్గర నుంచి, కేసు విచారణలో ఘోరమైన జాప్యం వరకూ విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి.
ఒక లారీ రాంగ్రూట్లో వచ్చి కారును ఢీకొన్న ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధితురాలి పిన్నమ్మలు ఇద్దరు మరణించారు. ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. లారీ వచ్చి ఢీకొనడం సెనగర్ పనేనని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సెనగర్పై, మరో 11 మందిపై హత్య, హత్యాప్రయత్నం అభియోగలతో కేసు పెట్టారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం సోమవారం రాత్రి ఈ కేసును సిబిఐకి అప్పగించింది.
ఈ ప్రమాదం పుణ్యమా అని ఉన్నావ్ బాధితురాలి పట్ల వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదీ బయటకువస్తోంది. తన కుటుంబానికి ఏమాత్రం భద్రత లేదని ఆమె సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయం నిన్న బయటకు వచ్చింది. జూలై 12వ తేదీన రాసిన లేఖను 30వ తేదీ వరకూ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లలేదు.
కేసు విచారణను ఉత్తరప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలని కోరుతూ బాధితురాలి కుటటుంబం పెట్టుకున్న విజ్ఞప్తి కూడా సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
ఇక రేప్ కేసు విచారణ తీరుతెన్నులు తెలుసుకుంటే వ్యవస్థలు బాధితురాలి పక్షాన ఉన్నాయో నిందితుల పక్షాన ఉన్నయో కాస్త అర్ధం అవుతుంది. కులదీప్ సెనగర్ తనపై అత్యాచారం జరిపినట్లు ఆ మైనర్ బాలిక 2018 ఏప్రిల్లో ఫిర్యాదు చేసింది. ప్రజలలో పెద్ద ఎత్తున స్పందన కనిపించడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు సెనగర్ను అదే నెలలో అరెస్టు చేశారు.
2018 మే నెలలో అలహాబాద్ హైకోర్టు ఈ కేసును పిల్లలపై అత్యాచారాల నిరోధక చట్టం కోర్టు నుంచి లక్నోలోని సిబిఐ ప్రత్యేకకోర్టుకు బదిలీ చేసింది. రెండు నెలల తర్వాత సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2018 జూలైలో సిబిఐ కోర్టు నిందితులపై అభియోగలను పరిగణనలోకి తీసుకుంది. అప్పటినుంచీ ఇప్పటివరకూ కేసులో పురోగతి లేదు.
చట్ట సభల సభ్యులపై క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు అదేశానుసారం 2018 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కోర్టును ఏర్పాటు చేసింది. ఉన్నావ్ బాధితురాలి కేసును సిబిఐ ప్రత్యేక కోర్టులోనే విచారించాలా లేక చట్ట సభల సభ్యుల కోసం ఏర్పాటయిన ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించాలా అన్న మీమాంసతో కేసు విచారణ పెండింగ్లో ఉండిపోయింది.
2019 ఏప్రిల్లో సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి వత్సల్ శ్రీవాత్సవ్ను ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ స్వస్థలమైన గోరఖ్పూర్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో న్యాయమూర్తి లేని కోర్టు ముందు ఉన్నావ్ బాధితురాలి కేసు విచారణ పెండింగ్లో ఉంది.
ఇక్కడితో అయిపోలేదు. మొదట ఈ కేసును తనంతట తానుగా చేపట్టి సిబిఐ విచారణకు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు ఈ మధ్య ఈ కేసులో అమికస్ క్యూరీగా (న్యాయస్థానానికి సహాయకుడు) ఉన్న గోపాల్ చతుర్వేది రిపోర్టును నమోదు చేసింది. ఆశ్చర్యకరంగా, అసలు ఇంతవరకూ కదిలిక లేని ఈ కేసులో విచారణ కొనసాగుతోందని ఆయన హైకోర్టుకు నివేదించారు.