అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి ఎం పల్లంరాజును నియమించనున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం పలువురి పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్ఠానం పల్లంరాజును ఎంపిక చేసేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా పలువురు రాష్ట్ర బాధ్యులు రాజీనామా చేశారు. ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో సామాజిక సమీకరణల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత పల్లంరాజుకు పిసిసి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నదని ప్రచారం జరుగుతోంది.
పల్లంరాజు కుటుంబం తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉంటున్నది. ఆయన తండ్రి సంజీవరావు కాకినాడ నుండి మూడు సార్లు లోక్సభకు ఎన్నిక అయ్యారు. ఇందిరా గాంధీ మంత్రివర్గంలోనూ మంత్రిగా పని చేశారు. పల్లంరాజు కూడా మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నిక అయ్యారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రక్షణశాఖ సహాయ మంత్రిగా, తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖలో కేబినెట్ హోదా మంత్రిగా పని చేశారు.