న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆగస్టు 9న జైట్లీ ఎయిమ్స్లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హైల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. ఈ నెల 20న ఆయనకు వెంటిలేటర్ను అమర్చారు. జైట్లీ ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలియడంతో పలువురు బీజేపీ నేతలు ఎయిమ్స్కు తరలివస్తున్నారు. జైట్లీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఎయిమ్స్ చేరుకొని జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు జైట్లీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్, రామ్విలాస్ పాశ్వాన్, అమిత్షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, జ్యోతిరాధిత్య సింథియా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పరామర్శించారు.
అనారోగ్యం వల్లే జైట్లీ… 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది మే నెలలో ఆయన మూత్రపిండ మార్పిడి చికిత్స నిమిత్తం ఎయిమ్స్లో చేరారు. డయాబెటిస్తో బాధపడుతున్న జైట్లీ… 2014 సెప్టెంబర్లో బరువు తగ్గించుకునేందుకు బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.