(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
అమరావతి : ఏపీ రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనధికారవర్గాల సమాచారం ప్రకారం ఏపీలోని 13 జిల్లా కేంద్రాలన్నిటినీ రాజధానులుగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని నగరమే ఉండాలన్న విధానం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలను రాజధానులుగా ప్రకటించి ఆ తర్వాత జిల్లాల సంఖ్యను గనక పెంచుకుంటే ఆ మేరకు రాజధానులు కూడా పెంచుకోవచ్చన్నది ప్రభుత్వపెద్దల ఆలోచనగా ఉంది. దీని ద్వారా పాలనను ప్రజల ముంగిటికే తీసుకుపోవచ్చునని సీఎం బలంగా విశ్వసిస్తున్నారు. కడపలో సీఎం క్యాంప్ ఆఫీసు, విశాఖలో ఎండాకాలం అసెంబ్లీ, కర్నూలులో శీతాకాల అసెంబ్లీ, ఒంగోలులో వర్షాకాల అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు భోగట్టా. సచివాలయాన్ని కూడా జిల్లాలవారీగా ఏర్పాటు చేయాలని ఆయన తలపోస్తున్నారు. ఇప్పటికే గ్రామసచివాలయాలు ఉన్నందున జిల్లా సచివాలయాల ఏర్పాటు సమస్య కాబోదని ఆయన భావిస్తున్నారు.
అమరావతిలో పునాదులు తీయాలంటే వంద అడుగుల లోతులో వేయవలసి ఉంటుందని వాదిస్తున్న ప్రభుత్వం మిగతా జిల్లాల్లో రాజధాని భవనాలను అసలు పునాదులు తీయకుండానే నిర్మించాలని నిర్ణయించింది. పైగా ఏపీలో ఎలాగూ ఇసుక కరువైపోయింది కనుక ఇసుకను కూడా వాడకుండా నిర్మాణాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆదేశాలివ్వనున్నట్లు చెబుతున్నారు. ఇసుక రహిత నిర్మాణాలను ప్రోత్సహించాలనీ, అందుకు రాయితీలు ఇవ్వాలనీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇసుక, సిమెంటులకు బదులు బంకమట్టి వాడడం వల్ల భవనాలు పర్యావరణహితంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రజాధనం ఆదా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
ప్రజాభిప్రాయం ఎలాగూ 13 రాజధానుల ప్రతిపాదనలకు అనుకూలంగానే ఉంటుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఒక్కో రాజధానికి రూ. 2,065 కోట్ల చొప్పున 13 రాజధానులకు రూ. 26,845 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం కోరవచ్చని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇదిలావుండగా ప్రభుత్వ ప్రతిపాదనలపై టీడీపీ మండిపడింది. పదమూడు రాజధానులకు పదముగ్గురు సీఎంలను ప్రకటిస్తే తమకు ఈ ప్రతిపాదనలు సమ్మతమేనని నారా లోకేశ్ ఒక ట్వీట్ లో వ్యాఖ్యానించారు. తమ హయాంలో అమరావతి గ్రాఫిక్స్ కోసం ఎంతో శ్రమించామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కమిటీలే తప్ప గ్రాఫిక్ వర్కే లేకుండా పోయిందని ఆయన ఎత్తిపొడిచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాహుబలి మేకర్ రాజమౌళిని సంప్రదించి అమరావతి సెట్టింగులు వేయించిన సంగతి ఆయన గుర్తు చేశారు. కాగా, 13 రాజధానుల ఆలోచననను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. చంద్రబాబు నాయుడు ఒక్క రాజధానిని కూడా నిర్మించలేకపోయారనీ, అదే జగన్ సాహసోపేతంగా పదమూడు రాజధానుల నిర్మాణానికి పూనుకున్నారనీ ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసించారు. అయితే కొందరు సిద్ధాంతులు మాత్రం 13 సంఖ్య శుభకరం కానందున పన్నెండొక్క రాజధానులుగా వాటిని పిలవాలని సూచిస్తున్నారు.
——————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.