న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ, పోలీసు డైరక్టర్ జనరల్ ఓంప్రకాష్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోని జస్టిస్ గొగోయ్ ఛాంబర్లో ఆయనను కలిశారు.
ఈ నెల 17న జస్టిస్ గొగోయ్ పదవీవిరమణ చేసే లోపు అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. దేశరాజకీయాలపై పెను ప్రభావం చూపనున్న ఈ తీర్పు దరిమిలా ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రధాన న్యాయమూర్తి ఆ అధికారులతో సమీక్షించారు.
జస్టిస్ గొగోయ్ పదవీవిరమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ బాబ్డే, అయోధ్య వివాదం కేసును ప్రపంచంలోనే ముఖ్యమైన కేసుల్లో ఒకటిగా అభివర్ణించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో 133 ఏళ్ల ఈ వివాదం కేసును 40 రోజుల పాటు విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా సభ్యుడు.