“అందం విషయంలో అత్యంత క్రూరమైన న్యాయమూర్తి అద్దమే!” అన్నారు ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ సోఫియా నామ్. అదేమాట మన ఎంకి ఎప్పుడో అనేసిందిగా! “అద్దమేలంటాది అందాలు తెలుప – ముద్దుమాటల కెంకిదే ముందు నడక” అనే ఎంకిపాట మనలో చాలామందిమి చిన్నప్పట్నుంచీ వింటున్నదే కదా? బహుశా ఎంకిపాటలు గుజరాతీ భాషలోకి అనువాదమై వుండవు- అందుకే ప్రధాని మోదీకీ, హోమ్ మంత్రి అమిత్ షాకీ ఈ పాట తెలిసి ఉండదు! విషయమేమిటంటే మన “ఎంకిపాట” మనకు తెలుసు కనక మనమైనా కాస్త ఆలోచించాలి కదా!!
ముఖ్యంగా “ద ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్” మన ప్రజాస్వామ్య వ్యవస్థ మొహం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చెప్పిన తర్వాతైనా ఎంకి పాటలు కాకపోయినా కనీసం ఆమె మాటలు మనసుకు ఎక్కించుకోవాలి కదా!
ఇంతకీ ఈ “ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్” అనగానేమి?
దాని కథా కమామిషు ఏమిటి? అని కనీసం ఇప్పుడైనా తెలుసుకోకపోతే, ఎంకి పుట్టిన గడ్డమీదే మనమూ పుట్టామని చెప్పుకోతగునా?
అంచేత, అదేదో చూసొద్దాం పదండి!
అనగనగా ఓ లండన్ నగరం-
ఆ నగరంలో “ద ఎకానమిస్ట్” అనేది ప్రముఖ వారపత్రిక-
సదరు పత్రిక పెట్టి మరో పాతికేళ్ళకు రెండొందల సంవత్సరాలు అవుతాయంతే!-
ఈ పత్రిక శతవార్షికోత్సవం సందర్భంగా అనుకుంటా -డెబ్భై-ఎనభై ఏళ్ళ కిందట- “ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్” అనే విభాగం ఏర్పడింది.
దాదాపు దశాబ్దంన్నరగా సదరు విభాగం ఓ “అద్దం” తయారుచేసి ప్రపంచం లోని 167 దేశాలకు దాన్ని చూపిస్తూ వస్తోంది.
ఆ 167దేశాలూ తమను తాము ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటూ ఉంటాయి. వాటిల్లో రెండో, మూడో తప్పిస్తే మిగతావన్నీ ఐక్య రాజ్య సమితిలో సభ్య దేశాలే.
సదరు అద్దాన్నే “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక”గా మేధావులు వ్యవహరిస్తుంటారు. ఈ అద్దం ప్రతి ఒక్క “ప్రజాస్వామ్య” దేశానికీ ఒక్కో ర్యాంక్ ఇస్తుంది. దాదాపుగా అది ఆయా దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది.
ఈనెల 22న తాజాగా ఎకానమిస్ట్ “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” ప్రోగ్రెస్ కార్డు విడుదల చేసింది. ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశం ఈ రిపోర్ట్లో 51వ స్థానంలో సగర్వంగా కూలబడివుంది! కిందటి ఏడాది ఇదే రిపోర్ట్ మన ప్రజాస్వామ్యాన్ని 41వ స్థానంలో నిలబెట్టగా ఇప్పుడది పది స్థానాల దిగువన మనకోసం ఒక కుర్చీ ఖాళీ చేయించి పెట్టింది. 2018-19 సంవత్సరంలో ఎకానమిస్ట్ “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” మన ప్రజాస్వామ్యానికి 7.23 పాయింట్ల “స్కోరు” ప్రకటించగా, అది 2019-20 సంవత్సరానికి గాను 6.9 పాయింట్లకు పతనమైంది. ఫలితంగా మన ప్రజాస్వామ్యం స్థానం పది మెట్లు దిగజారింది!
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత ప్రజాస్వామ్యం ఎనిమిదో స్థానానికి దిగజారింది. మనం తైవాన్ కన్నా కూడా వెనకబడి ఉన్నామని ఈ సూచిక తేల్చింది!
అయ్యా,, “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” అనే అద్దంలో ప్రతిఫలిస్తున్న మన సౌందర్యం ఇంత వైభోగంగా వుంది మరి!!
ఈ “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” రూపొందించేవాళ్ళు ప్రధానంగా అయిదు అంశాలను ప్రాతిపదికలుగా తీసుకుంటారు. వాటిల్లో మూడింట్లో భారత ప్రజాస్వామ్యమూ, ప్రభుత్వమూ, రాజకీయ సంస్కృతీ దిగజారుతూ వచ్చాయన్నది “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” సూచన. అవేమిటో ఒక్కసారి చూద్దాం-
“ఎన్నికల్లో బహుళత్వం”, “రాజకీయ భాగస్వామ్యం”, “పౌర స్వేచ్ఛ” – ఈ ప్రాతిపదికలు ఆధారంగా భారత్ ప్రజాస్వామ్యం పతనమైందని ఈ సూచిక తేల్చి చెప్పింది.
అయినా నాకు తెలియక అడుగుతున్నా- ఏ ఎకానమిస్ట్ పత్రికో వచ్చి “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” చూపిస్తే తప్ప మన ప్రజాస్వామ్యం ఎలావుందో మనకు తెలియదా?
కిందటి ఏడాది, ఈ సంవత్సరం సూచికల్లో ఎందుకంత తేడా వచ్చిపడిందో మనకు తెలియదా?
ఈ తేడా రావడానికి దారితీసిన పరిణామాలు ఏమిటో మనకు తెలియనివా?
ఎంతమాత్రం కావు!!
2019 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఒంటిచేతి మీద 303 సీట్లు గెల్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అనగా – సొంత బలం మీదే తాను కోరుకున్న రాజ్యాంగ సవరణలు ఆమోదింపచేసుకునే బలం బీజేపీకి సంక్రమించిందన్నమాట!
ఆ బలాన్ని వెంటనే ప్రదర్శించటం మొదలుపెట్టింది ఆ పార్టీ ప్రభుత్వం.
ఆర్టికిల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదా తొలగించింది.
ఆర్టికిల్ 35ఏ రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్ “భూమిపుత్రులకు” రాజ్యాంగబద్ధంగా కల్పించిన రక్షణను తొలగించింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సైనిక బలగాలను పెంచడం, స్థానిక నేతలను గృహనిర్బంధంలో పెట్టడం, ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని రద్దుచెయ్యడం లాంటి చర్యలు బీజేపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయి.
అదేమాట “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” కూడా చెప్తోంది.
అస్సామ్లో జరిగిన ఎన్నార్సీ ఏరివేతల సందర్భంగా 19 లక్షలమందిని జాతీయ పౌర జాబితా లోంచి తొలగించారని “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” పేర్కొంది.
దేశంలో కొనసాగించనున్న “పౌరసత్వ సంస్కరణలు” సైతం ఇదే దారిలో ఉంటాయన్నది “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” సూచన.
ఈ ధోరణికి “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” ఓ పేరు పెట్టింది- అదే “లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం”
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎన్నికలు సక్రమంగానే జరుగుతాయి గానీ పాలన లోపభూయిష్టంగా ఉంటుందని “ప్రపంచ ప్రజాస్వామ్య సూచిక” చెప్తోంది. ప్రపంచం మొత్తం మీద 54 దేశాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయట!
హమ్మయ్య – ఈ రంగంలో మనం ఒంటరివాళ్ళం కాదన్నమాట!!
ఎంత కష్టంలోనైనా, ఎవరో ఒకరు తోడున్నారనుకుంటే ఆ తృప్తే వేరు!!
ఏమంటారు??
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ