(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాజ్య సభ ఎన్నికలూ వాయిదా పడ్డాయి. చివరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ నెలాఖరు లోగా నిర్వహించాల్సి ఉన్న బడ్జెట్ సెషన్ కూడా వాయిదా పడనుంది.
నెలాఖరులోగా వార్షిక బడ్జెట్ ఆమోదం పొందాలి
మార్చి 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ నెల 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధిగమించాలంటే ఈ నెలాఖరులోగా రాష్ట్ర శాసనసభ, మండలిలో రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి.
అనుకూలంగా లేని పరిస్థితులు
మార్చి 31 లోగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆమోదింప చేసుకోవాల్సిన తరుణంలో కరోనా విరుచుకుపడడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు. బడ్జెట్ ఆమోదానికి, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదానికి కనీసం అయిదు రోజుల సెషన్ నిర్వహించాల్సిన అవసరం వుండడం, దానికి తగిన వాతావరణం లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ ద్వారా తాత్కాలిక వెసులుబాటుకు సిద్దమవుతున్నారు.
ఆర్డినెన్సు దిశగా
మార్చి 31వ తేదీ తర్వాత నిధుల వినియోగానికి వీలుగా ఆర్డినెన్సు జారీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆర్డినెన్సు జారీకి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. నేడో, రేపో ఆర్డినెన్సు జారీ చేయడం ద్వారా ఏప్రిల్ ఒకటి తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల విడుదలకు వెసులుబాటు పొందాలనీ, మే నెలలో గానీ, జూన్ నెలలోగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. లాక్ డౌన్ కారణంగా బడ్జెట్ సెషన్ నిర్వహణకు అనుకూల వాతావరణం లేకపోవడంతో న్యాయ, రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలించి ఆర్డినెన్సు జారీకి రంగం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కోరినట్లు సమాచారం. కనీసం మూడు నెలల కాలానికి ప్రభుత్వ నిధులను వినియోగించుకునేందుకు వీలుగా ఆర్డినెన్సు జారీకి చర్యలను ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఇవాళో, రేపో అధికారిక ప్రకటన జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మూడు నెలల కాలానికి నిధులు వినియోగించుకునేలా ఆర్డినెన్సు జారీ చేసి, పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.
శుక్రవారం ఉదయం క్యాబినెట్ భేటీ
శుక్రవారం ఉదయం 11గంటలకు సిఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగుతున్నది. ఈ భేటీలోనే ఆర్డినెన్ జారీపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ సమావేశాన్ని రెగ్యులర్ క్యాబినెట్ హల్ లో కాకుండా ముఖ్యమంత్రి మీటింగ్ హల్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్యాబినెట్ భేటీలో ఆర్డినెన్ పై చర్చించి ఆమోదించనున్నారని సమాచారం.