AP Capital Issue: సింహం రెండు అడుగులు వెనక్కు వేసింది అంటే…అది వెనుకడుకు వేసినట్లు కాదు. అదును కోసం అని అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు జగన్ చేసింది అదే. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో జగన్ వెనుకడుగు వేశారంటూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ లు నిర్వహిస్తున్నారు. జగన్ వెనుకడుగు వేయడంలో ఒక వ్యూహం దాగి ఉందని ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రతిపక్షాలు గోల చేసినా, ఒకటి రెండు జిల్లాల్లో వ్యతిరేకత వచ్చినా డొంట్ కేర్ అనే మనస్థత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిది అని అందరికీ తెలుసు. జగన్ అంటే జగ మొండి అని కూడా చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణకు జగన్ ఫిక్స్ అయి ఉన్నాయి. ఆ విషయంలో ఎటువంటి మార్పులేదు. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఉప సంహరణ సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల నుండి సూచనలు, సలహాలు తీసుకుని మెరుగైన బిల్లు తీసుకువస్తామని పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న బిల్లులో సాంకేతిక లోపాలు ఉన్నాయనీ, ఇవి న్యాయసమీక్షలో నిలబడవు అని అర్ధం అయిపోయింది.
AP Capital Issue: హైకోర్టు జోలికి వెళ్లకుంటే నో ఇష్యూ..?
కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో హైకోర్టులో వాదనల సమయంలో రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్ ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. హైకోర్టు మార్పు అనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాదు. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయిన నేపథ్యంలో దాన్ని కదిలించడం ఇబ్బందికరం. దీన్ని వదిలివేసి అసెంబ్లీని, సెక్రటేరియట్ ను ఎక్కడ పెట్టుకున్నా సీఎం ఎక్కడ ఉండి పరిపాలన సాగించినా ఎవరికీ అడిగేందుకు అవకాశం ఉండదు. గతంలో తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయిన సమయంలో కర్నూలులో రాజదాని, గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ మాదిరిగానే ఇప్పుడు కూడా హైకోర్టును గుంటూరు జిల్లా అమరావతిలోనే ఉంచేసి రాజధానిలో ఉండే అసెంబ్లీ, సచివాలయ వ్యవస్థను కర్నూలు, విశాఖకు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనేది టాక్. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపే మెరుగైన బిల్లును తీసుకురావాలని ఈ బిల్లుకు ప్రజామోదం కూడా ఉందని చూపడానికి మరో ఎత్తుగడ కూడా వేస్తున్నారని సమాచారం. అది ఏమిటంటే.. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 నుండి 90 శాతం వైసీపీనే గెలుచుకున్న సంగతి తెలిసిందే.
పంచాయతీల నుండి కార్పోరేషన్ వరకూ తీర్మానాలతో..?
ప్రభుత్వం తీసుకు రానున్న కొత్త బిల్లునకు మద్దతుగా గ్రామ పంచాయతీ నుండి కార్పోరేషన్ ల వరకూ తీర్మానాలు చేయించే అవకాశం ఉంటుంది అంటున్నారు. గ్రామ సభలతో తీర్మానాలు ఆమోదించుకుని అసెంబ్లీలో బిల్లు తీసుకువస్తే దానికి ప్రజామోదం ఉన్నట్లుగా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే హైకోర్టు గుంటూరు (అమరావతి)కే ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో కర్నూలును పరిపాలనా రాజధానిగా చేస్తారా లేక శాసన రాజధానిగా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక అమరావతి రైతుల సంగతి ఏమి చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే దాదాపు 700 రోజులుగా వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదు. చంద్రబాబు మనుషులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెయిడ్ బ్యాచ్ చేస్తున్న పాదయాత్రగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని ప్రజలు గెలిపించారు అంటే ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు స్పష్టం అవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సో.. ఇప్పుడు అవే స్థానిక సంస్థలతో తీర్మానాలు ఆమోదం చేసుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.