ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దగ్గుబాటి పురందరీశ్వరి వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి అమర్నాధ్ పురందరీశ్వరి వైఖరి పై విమర్శలు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..? అని ప్రశ్నించారు. మళ్లీ బాబు ఉచ్చులో పడితే మీ భర్తలానే మీ రాజకీయ చరిత్ర ముగిసిపోతుందనీ, దగ్గుబాటి వారు మరో పుస్తకం రాయాల్సిన పరిస్థితి తేవద్దు అంటూ సెటైర్ వేశారు. మీరు మాట్లాడుతున్నది.. బాబు స్క్రిప్టులా ఉందని అన్నారు మంత్రి అమర్నాథ్. బాబు హయాంలోనే చిత్తూరు మేయర్ని చాంబర్లోనే చంపేశారనీ, అప్పుడు ఎందుకు అరాచకం అని మాట్లాడలేదని ప్రశ్నించారు.
తండ్రి గారు పెట్టిన, మరిది గారు నడుపుతున్న పార్టీ కోసం ఎందుకంత ఆరాటం..? అదే పార్టీకి అధ్యక్షులు అయ్యి నేరుగా రాజకీయాలు చేయవచ్చుగా..?, కూతురిగా మీకు ఆ హక్కు, వారసత్వం కూడా ఉంది కదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం నుంచి ఆదాయం రావట్లేదా.. అని ప్రశ్నించారు. మీరు కేంద్రం నుంచి ఇస్తుందెంత..? మేం రాష్ట్రం నుంచి కడుతున్న పన్నులెంత..? ఉత్తరాదికి, దక్షిణాది రాష్ట్రాలకిచ్చే నిధుల తేడాపై చర్చిద్దామా..? అని సవాల్ విసిరారు. విశాఖ ఉక్కుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూములు ఇప్పించడానికి సిద్దంగా ఉన్నాం, పాత వాల్తేర్ రైల్వే జోన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలన్నారు. రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్న తీరు నీతిఆయోగ్ లెక్కలే చెప్తున్నాయన్నారు.
రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందని, రాష్ట్రం అప్పుల పాలవుతుందని, కేంద్రం నుంచి వస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని పురందేశ్వరి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం నుంచి 2021–22లో రూ.400 కోట్లు మాత్రమే రాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు ఖర్చు చేసిందని, మిగిలిన రూ.1100 కోట్లు మీరిచ్చారా..? అని ప్రశ్నించారు. మీరు ముసుగులు వేసుకుని వివిధ రాజకీయ పార్టీలకు వెళ్లి…అందరూ కలిసి జగన్ పై యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన అంతా కలిసి వచ్చినా 2024లో కూడా ఇంతకు మించి సీట్లతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
CM Jagan: భారీ వర్షాలు, వరదలపై వీడియో కాన్ఫరెన్స్ .. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్