Ayyannapatrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి ఎయిరిండియా విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అయ్యన్న పాత్రుడిని కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి విశాఖ వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఎలమంచిలి వద్ద అయ్యన్నకు పోలీసులు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరం లో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్, మంత్రులపై చేసిన కామెంట్స్ కు గానూ మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడితో పాటు మరి కొందరిపై 153ఏ, 354 ఏ 1 (4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఎయిర్ పోర్టు వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయ్యన్నపాత్రుడు అరెస్టు వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఖండించారు. అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్నువేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. అసమర్ధ, మాఫియా పాలకులను విమర్శించక ఏమి చేస్తారు అని ప్రశ్నించారు. జగన్ తప్పుల్లో పోలీసులు భాగస్వాములైతే భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు చంద్రబాబు.
YS Jagan: షర్మిల కాంగ్రెస్ లో చేరడం మీద మొట్టమొదటి సారి స్పందించిన జగన్ ?!