TDP Internal: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు ఉన్నప్పటికీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటి నుండి ఎన్నికల ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాయి. నియోజకవర్గాల్లో నేతలను ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ .. గతంలో ఇచ్చిన హామీలను 95 శాతంకుపైగా అమలు చేశామనీ, ప్రజలకు మేలు జరిగింది అంటే మరో సారి మద్దతు ఇవ్వాలనీ, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఒక సారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటిస్తున్నారు.
సీనియర్ నేతల తిరుగుబాట్లు
ఎన్నికల ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. సీనియర్ ల నుండి తిరుగుబాట్లు కనబడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ చార్జిల విషయంలో నాన్పుడు ధోరణితో వ్యవహరించడం వల్ల ఇప్పుడు తిరుగుబాట్లు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షంలో ఈ నాలుగేళ్లలో పలు నియోజకవర్గాల్లో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు నాయకులు రివర్స్ అవుతున్నారు. నియోజకవర్గ టీడీపీ గ్రూపు రాజకీయాలను వైసీపీ అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా రీసెంట్ గా పార్టీ లో చేరిన కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో దివంగత నేత కోడెల శివప్రసాద్ రాజకీయ వారసుడుగా పొలికల్ ఎంట్రీ ఇచ్చిన కోడెల శివరామ్ ఇప్పుడు పార్టీకి రివర్స్ అవుతున్నారు. అవసరం అయితే తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడానికి సిద్దమని ప్రకటించారు.
మరో పక్క విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా అధిష్టానంకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా ఫరవాలేదు, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గుతాను అని అంటున్నారు. అలానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత ఎస్ సీ వీ నాయుడును చంద్రబాబు టీడీపీలో చేర్చుకునే ప్రయత్నం చేయగా, దాన్ని వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ విడుదల చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో చంద్రబాబు ఎస్ సీవీ నాయుడు చేరికను వాయిదా వేశారు. అలానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరం పార్టీకి ఒక తలనొప్పిగా తయారైంది. అఖిలప్రియకు టికెట్ ఇవ్వనని చెబితే ఆమె కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. మరో పక్క కొందరు ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారవేత్తలు పలు నియోజకవర్గాల్లో టికెట్ లను ఆశిస్తూ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో పలువురు ముఖ్యనేతల ద్వారా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఉన్న ఇన్ చార్జిలకు మింగుడు పడటం లేదు.
రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. దీంతో ఎంత మంది సీనియర్ లను పక్కన పెడతారు.. వారు దానికి ఒప్పుకుంటారా అనేది చూడాలి. తన టికెట్ కు ఎసరు వస్తుందేమోనని ఇటీవల మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్ఆర్ఐల వ్యవహారంపై ఓపెన్ అయిపోయారు. ఎన్నికలకు ముందు వచ్చి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ ముందుకు వచ్చే వారిని చూసుకుంటే వాళ్లు ఎన్నికల తర్వాత మళ్లీ కనబడరని అన్నారు. పార్టీలో ఉన్న నేతలతో సంప్రదింపులు చేయకుండా ప్రత్యర్ధులను పార్టీలోకి చేర్చుకోవడం మూలంగా కర్నూలు జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ రీసెంట్ గా వైసీపీలో చేరారు. ఈ తాజా తలనొప్పులను టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాలి.