YS Jagan: ఏపిలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో వైసీపీ వర్గాల నుండి ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి..? ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలి..? అనే దానిపై సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన, అత్యంత సున్నితమైనది క్రమశిక్షణలో నిర్వహించాల్సిన శాఖ ఆర్ధిక శాఖ. ప్రస్తుత ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అప్పులు తీసుకురావడం, అప్పులకు వడ్డీల కట్టడం. నెలనెల చెల్లింపులు, సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ, కేంద్రం ఇచ్చే నిధులకు లెక్కలు చెప్పడం, వివిధ శాఖల వచ్చే రెవెన్యూ లెక్కలు చూసుకోవడం ఇలా అన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ బుగ్గన రాజేంద్రనాథ్ చూస్తూనే ఉన్నారు.
YS Jagan: ఆడిటర్ విజయసాయికి ఆర్ధిక శాఖ..?
కాకపోతే రాష్ట్రంలో ఆర్దిక క్రమశిక్షణ లోపించింది. ఇటు వచ్చిన నిధులు అటు తీసుకువెళ్లడం, అటు వచ్చిన నిధులను ఇటు మళ్లించడం, లెక్కకు మించి అప్పులు చేయాల్సి రావడం జరుగుతోంది. సంక్షేమ పథకాల అమలునకు కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలు చేయాల్సి వస్తోంది. అదే విధంగా మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి, ప్రభుత్వ భూములను తనఖా పెట్టి కూడా అప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో కీలకమైన ఆర్ధిక శాఖకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే కొనసాగించాలని జగన్ భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విజయసాయిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించి ఆయనకు ఆర్ధిక శాఖ మంత్రి బాధ్యతలు ఇస్తారుట. దీనికి అవకాశాలు ఉన్నాయా..? లేదా అంటే అవకాశం ఉందనే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎందుకంటే..? విజయసాయి స్వతహాగా చార్టెడ్ అకౌంటెంట్ కావడం వల్ల ఆర్ధిక శాఖను సమర్ధవంతంగా నిర్వహించగలరు అన్న అభిప్రాయం జగన్ కు ఉంది అని అంటున్నారు. ఇంతకు ముందు ఆయన చాలా కంపెనీలకు ఆడిటర్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది.
రాజ్యసభకు వైవీ సుబ్బారెడ్డి..?
కాగా విజయసాయి రెడ్డి విషయంలో మరో వాదన కూడా ఉంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకుండా పార్టీలోనే కీలకమైన బాద్యతల్లోనే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఒక వేళ విజయసాయిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఖాళీ అయ్యే అయన రాజ్యసభ స్థానాన్ని టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైవీ సుబ్బారెడ్డి త్యాగం చేసిన సమయంలో జగన్ ఆయనకు రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి మరి కొందరు పెద్దలకు జగన్ రాజ్యసభ హామీలు ఇచ్చారు. ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో విజయసాయిరెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడంతో పాటు వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభకు పంపి ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను చూసే బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారనేది పార్టీ నుండి అందుతున్న కీలక సమాచారం. టీటీడీ చైర్మన్ పదవిని బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఇస్తారని అనుకుంటున్నారు. ఈ పరిణామాలకు సంబంధించి త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.