(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కుల కాకులు అరుస్తున్నాయి. కులాగ్ని వెలిగిస్తున్నాయి. కులకుంపటి రగిలిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య వైరం కాస్తా, రెండు కులాల మధ్య వైరంగా మార్చేస్తూ కులకొమ్ములు వాడి చేస్తున్నారు. ఇటు చంద్రబాబునాయుడు, పక్కనే భజనపరుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రామోజీరావు… అటు జగన్మోహన్ రెడ్డి, పక్కనే భజన పరుడు విజయసాయిరెడ్డి, తదితరులు… సొంత, స్వార్ధ, రాజకీయ, పార్టీల ప్రయోజనార్ధం తమ కులలని రెచ్చగొట్టడం, ఎదుటి కులాల్ని తిట్టిపోయడం ఎక్కువవుతుంది. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బృందం కమ్మ వర్గాన్ని పూర్తిగా తప్పుల్లోకి నెట్టేసి వారిని విలన్లుగా చూపే ప్రయత్నం చేస్తుండగా…, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు వర్గం నాడు కమ్మ భజన చేసుకుంటూ, నేడు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు. ఇదీ రాష్ట్ర ఒరవడి.
చంద్రబాబునాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.., జగన్ మొహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారు కొన్ని దశాబ్దాల ముందు ఉండి ఉంటే…
- ఎన్టీ రామారావు, కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి లాంటి వారు కలిసి సినిమాలు తీసేవారా??
- పుచ్చలపల్లి సుందరయ్య, చెన్నమనేని రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, భూపతిరెడ్డి లాంటి వారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేవారా??
సినిమాలు, ఉద్యమం మాట కాదు. కనీసం కమ్మ, రెడ్డి అనే కులాల్లో పిల్లల్ని ఇచ్చుకునేవారా? పెళ్లిళ్లు జరిగేవా? కలిసి తిరిగేవారా??? కులాగ్ని రగిలిస్టు ఏం లాభపడదామని? ఎవర్నీ ఉద్దరిద్దామని? అసలు ఈ కుల కాకులు అరుపుల్లో రాష్ట్రాన్ని ఏం చేద్దామని??? - అదే చె(కొ)త్త పలుకు…!
- ఈరోజు ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో ప్రతి పలుకు కమ్మ వారిని రెచ్చగొట్టేదే. ప్రతి పలుకు జగన్ పై ఉసిగొల్పేదే. ప్రతి పలుకు రాజకీయ ఆపాదనే. ఒక జర్నలిస్టుగా, ఒక మీడియా అధిపతిగా కులాల మధ్య రగులుతున్న వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోగా మరింత ఆజ్యం పోస్తూ పలుకులు రాసుకొచ్చారు. రాధాకృష్ణకి కమ్మ, చంద్రబాబు భజన కొత్తకాదు. ఆయన నరనరానా ఈ రెండు జీర్ణించుకున్నాయి. ప్రతి వారం కొత్త పలుకులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తూ, మంచిని సైతం చెడుగా చూపిస్తూ, చెప్తూ ఉంటారు. నేటి వ్యాఖ్యలు మరి కాస్త ముందుకెళ్లి కుల వైపరీత్యాన్నీ తాకించారు.
కాకపోతే రాష్ట్రంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. రాజకీయంగా వైరం పెరిగింది. అభివృద్ధి ఆగుతుంది. కులాల మధ్య వైరం పెరుగుతుంది. అదే సమయంలో కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు అతలాకుతలం అవుతున్నాయి. పలకాల్సిన అంశాలు, రాయాల్సిన అంశాలు బోలేడున్నాయి. “కరోనా ప్రభలుతుంది. కరోనా నివారణకు ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకుండా, రాజకీయాలు చేస్తుంది.. అన్నవరకు ఓకే కానీ, కమ్మలకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది, కమ్మలను అనగదొక్కుతుంది” అన్నట్టుగా రాసుకొచ్చారు. నిజానికి జగన్ బృందానికి కమ్మపై అంత వ్యతిరేకత రావడానికి చంద్రబాబు గత చర్యలే కారణం. రాధాకృష్ణ, రామోజీరావు వార్తలే కారణం. పదేళ్ల కిందట మొదలైన ఈ వైరం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది.
శృతిమించుతున్న అధికారపక్షం…!
ప్రతిపక్షాలు అధికార దాహంతో ఉంటాయి. శృతిమించడం సహజమే. అప్పుడప్పుడూ సహనం కోల్పోతుంటాయి. ఇవన్నీ సహజమే. కానీ ఇక్కడ అధికార పక్షం కూడా సహనం కోల్పోయి, శృతి మించుతుండడం రాష్ట్రంలో సగటు మనిషికి ఆందోళన కలిగించే అంశాలు. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ పెట్టిన తొలి ప్రెస్ మీట్ లో సామాజికవర్గం అంశాలను లెవనెత్తడం.., సాక్షాత్తు రాజ్యాంగ బద్ధమైన పదవికి కులం రంగు అంటించేలా వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయమే. ఆయన ఈ వ్యాఖ్యలు చేయకుండా మంత్రుల చేత చేయిస్తే విషయం ఒక దశ వరకే ఉండేది. ఇక్కడే జగన్ అనుభవ రాహిత్యం బయటపడింది. జగన్ అండతో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు కూడా శృతిమించుతున్నారు. నిజానికి చంద్రబాబు ఇదే స్థానంలో ఉంటే ఆయన భజన పరుల చేతనే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. నేరుగా సీఎం స్థాయిలో ఇలా మాట్లాడేవారు కాదు. కానీ తెర వెనుక చాలా పనులు చక్కబెట్టేవారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఎన్నికల కమీషన్, కమీషనర్ కూడా సీఎంపై చిన్నచూపుతో ఉంటారనడంలో సందేహం లేదు. అదే కారణంతో ఆయన నేరుగా కేంద్ర బలగాల రక్షణ కోరారు. దీన్ని అదనుగా చేసుకుని తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. ఆయన పది అడుగులు ముందుకేసి కమ్మ కులస్తులను “సూసైడ్ స్క్వాడ్” గా పేర్కొనడం వైపరీత్యానికి అద్దం పడుతోంది. అటు రాధాకృష్ణ, ఇటు విజయసాయిరెడ్డి లాంటి వారు దిగజారుడు వ్యాఖ్యలతో కుల వైరాన్ని పెంచుతున్నారు. ఫలితంగా నష్టపోయేది రాష్ట్రం, ముఖ్యమంత్రిగా జగనే. అది తెలుసుకుంటేనే, కుల వ్యాఖ్యలు ఆగితేనే రాజకీయాలు రాజకీయల్లాగా హుందాగా ఉంటాయి.
ఇదే కొనసాగితే పరిస్థితి…! - చంద్రబాబు, జగన్ వారి బృందం ఇలాగే కుల భజనలో కొనసాగితే పరిస్థితి కులమే పరిష్కారం చూపుతుంది. ఇది మంచిది కాదు, కానీ జనం చేతిలో, సగటు రాజకీయ అభిమాని మనసులో సరైన ప్రత్యామ్నాయం ఉంటుంది. నిజానికి రాష్ట్రంలో ఏ నాటి నుండో కులాల పోరాటాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా దశలు మారుతున్నట్టుగా కుల వైరం కూడా రాజకీయం ముసుగులో ముదిరింది. ఇదే అదనుగా మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న కాపు కులం కుదురుకునే అవకాశం ఉంది. నిజానికి కమ్మ, రెడ్డి కంటే కాపు ఓటింగ్, నాయకులు ఈ రాష్ట్రంలో ఎక్కువ. కానీ నడిపించే నాయకుడు లేక ఇన్నాళ్లు అవకాశం కోసం చూస్తున్నారు. పదేళ్ల కిందట చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ వారికి రాజకీయ అడుగులు తడబడి, అత్యాశకు పోయి భంగపడ్డారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలోని కొందరు కీలక కాపు నాయకులు ఒకే మాట, బాటపై ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు తరచు టచ్ లో ఉంటూ చర్చించుకుంటుంటారు. సరైన సమయం చూసుకుని వారందరూ ఒక పార్టీలోకి వెళ్లి పీఠం దక్కించుకునే కసరత్తుల్లో ఉన్నారు. మరో రెండు, మూడేళ్ళకి రాష్ట్రంలోని కాపు నాయకులంతా ఒకే పార్టీలోకి చేరినా ఆశ్చర్యం అవసరం లేదు. రాష్ట్రాన్ని కుల రాష్ట్రంగా తయారు చేయడం మొదలు పెట్టింది చంద్రబాబు అయితే, దాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తున్నది జగన్ మోహన్ రెడ్డి. రానున్న కాలంలో కాపులు ఇదే కొనసాగించిన ఆశ్చర్యం లేదు. ఎటొచ్చి మధ్య, చిన్న తరహా కులాలే వీటికి, వీరికి పావులు. రెక్కల్లేని పావురాలు. ముందు తరాల భవిష్యత్తుపై ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
- శ్రీనివాస్ మానెం