“పాకిస్థాన్ అసత్య ప్రచారాన్ని బయటపెట్టారు”. ఇది భారతీయ వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధ విమానాన్ని పాకిస్థాన్ సైన్యం కూల్చివేసిన ఘటన మీద ఒక విశ్రాంత వాయుసేన చీఫ్ మార్షల్ని ఒక వ్యాఖ్యాత ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఆ ఛానల్ టీ.వి. తెర మీద కనిపించిన శీర్షిక.
ఇక్కడ నా సందేహం ఏంటంటే ప్రభుత్వ వాదనలనే తమ వాదనలుగా తమ శృతి-లయలలో వినిపిస్తున్న ఈ ఛానళ్ళ రాజ్యంలో తమ ఈ శీర్షిక ఎంతటి పరిహాసమో ఆ వ్యాఖ్యాత కానీ ఆ ఛానల్ న్యూస్ టీమ్ కానీ గ్రహించారో లేదో అని. ఒకవేళ గ్రహించినా అది వారిని కట్టడి చేస్తుందా? కష్టం. ఎందుకంటే పాత్రికేయ విలువలు ఏమైనా అవ్వనీ వారు మాత్రం తమ జాతీయ బాధ్యతని నెరవేరుస్తున్నారు. పెరిగిన టి.ఆర్.పి రేటింగులు దీనికి బోనస్.
“ పాత్రికేయులు అయ్యేందుకు జాతీయవాదులు కావడం అనేది కనీసావసరం” అని ఆధునిక భారతీయ వార్తా ఛానళ్ళ పితామహుడు అర్నబ్ గోస్వామి పేర్కొన్నారు. అతని అనుంగులు, భక్తులు ఈ సూక్తిని విశ్వాసపాత్రులుగా తుచ తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి మనం ఈ జాతీయవాద క్రీడని చూస్తున్నాము. అందులో భాగమే గంభీర వదనంతో యువతీ యువకులు ప్రతి రోజు రాత్రి అత్యుత్సాహంతో నడుపుతున్న చర్చలు.
ఆజ్ తక్ ఛానల్ లో ఇండియా గేట్ నేపధ్యంగా వేసిన సెట్ మీద నుంచుని ఐదుగురు మగవాళ్ళు- ఈ మధ్య కాలంలో మహిళా ప్యానలిస్టులు కనబడటమే లేదు- “పాకిస్థాన్ని కాళ్ళ బేరానికి తీసుకురావటం”, “ క్యాన్సర్ ని పూర్తిగా నిర్మూలించటం” ఎలా అనే వాటి మీద తమ తమ పరిష్కారాలు ఇస్తున్నారు. ఈ సెట్ కి ముందువైపు ప్రేక్షకులు ఒకరు ఒక భారీ జాతీయ జండాని ఊపారు.
తాము సాధారణంగా “దేశద్రోహులు” గా అనుమానించే విద్యార్ధులు, ఉదారవాదులు, శాంతికాముకులను ప్రతీకాత్మకంగా చూపుతూ “దేశద్రోహులు” ఎక్కడ అని మరొక వ్యాఖ్యాత గొంతు చించుకున్నారు. ఒక తెలుగు ఛానల్ లో వ్యాఖ్యాత సైనిక దుస్తులలో, ఒక బొమ్మ తుపాకి పట్టుకుని వచ్చారు. క్యూబాలో అంతా ప్రశాంతంగా ఉంది అక్కడ యుద్ధమేమి లేదు అని తనతో అన్న రిపోర్టర్ తో విలియం రాండాల్ఫ్ హెస్ట్ “నువ్వు నాకు ఫోటోలు చూపించు నేను నీకు యుద్ధాన్ని చూపుతాను” అన్నారు. భారతీయ టీ.వి ఛానళ్ళు దానిని వక్రీకరించి [లేని] యుద్ధం చూపించదలచుకున్నాయి. చల్లారని అంగస్థంభన లాంటి మీడియా తీరు ఒక నకిలీ పురుషత్వ స్థితిని ఎగదోస్తుందని ఒక డాక్టర్ మిత్రుడు అంటాడు.
ఛానళ్ళ బయట కూడా పరిస్థితి గొప్పగా ఏమి లేదు. కాస్త నిగ్రహంగా ఉంటారు అని భావించిన సీనియర్ పాత్రికేయులు కూడా పాకిస్థాన్ భూభాగంలో భారతీయ వైమానిక దళం దాడులను పొగుడుతూ సామాజిక మాధ్యమాలలో చెలరేగిపోయారు. అది ఒకరికి ఇబ్బంది లేని వారి వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఇటువంటి జాతీయవాద అత్యుత్సాహానికి వారు నిస్సిగ్గుగా తమ మద్దతు తెలియచెయ్యటం యుద్ధోన్మాద శక్తులకి ఎంతోకొంత సాధికారత కల్పించడమే అవుతుంది.
వాస్తవాలని నిర్ధారించుకోవడం, ప్రభుత్వాన్ని సాక్ష్యం చూపించమనడం, దేశభక్తిని నిరూపించుకోవాలి అనే ఒక దుగ్ధ లేకుండా ఒక స్థాయి నిర్లిప్తత, దూరం పాటించడం అనేవి జర్నలిజం మౌలిక సూత్రాలు. నీ ముందున్నది “జాతి మానసిక స్థితి” కావొచ్చు-నిజానికి ఇదే ఒక అవాస్తవికమైన భావన. ఒకవేళ అదే నిజమైనా జర్నలిజానికి దానితో పనేముంది?
టి.ఆర్.పి రేటింగుల కోసమే రాత్రి పూట దేశం, దేశభక్తి, పాకిస్థాన్ అని కేకలు, ‘దేశ-ద్రోహుల’ మీద ద్వేషపూరిత దాడి జరుగుతున్నాయి అనుకునేవాడిని. డబ్బులు సంపాదించటం కష్టమైన తరుణంలో తమకి తెలిసిన విద్యలన్నీ ఛానళ్ళు ప్రదర్శించటం ఒక రకంగా సబబే. ప్రేక్షకులు అవి కోరుకుంటున్నారు, ఆ ప్రేక్షకులని నిలుపుకోవటానికి ఛానళ్ళు వాటిని అందిస్తున్నాయి. ఇది వ్యాపార దృష్టికోణంలో సరైనదే అనుకునే వాడిని.
కానీ ఇప్పుడు నాకు ఆ స్పష్టత లేదు. తాము “దేశ ద్రోహులుగా” భావించిన వారి మీద తీవ్ర ప్రచార దాడి నిర్వహిస్తున్న ఈ ఛానళ్ల తీరు ప్రభుత్వం, సంఘ్ పరివార్ అజెండాతో చాలా దగ్గరగా మమేకం అవుతున్నది. అన్నీ కాకపోయినా కొన్ని టి.వి ఛానళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మానసిక స్థితిని, కథనాన్ని నిర్మించటంలో సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.
వారు కేవలం నరేంద్ర మోదీ, అతని పరిపాలక వర్గం మద్దతుదారులు మాత్రమే కాదు. తమ వాదాన్ని ప్రచారం చేసుకోవటమే కాకుండా మిగతా వారు మాట్లాడే పరిస్థితి లేకుండా తమ విషయాన్నే పదింతలు చేసి చెప్పే విధంగా ఉన్న జగడాలమారి మీడియా ఇది. వారి జగడాలమారి మనస్తత్వం కేవలం ఒక పోజు మాత్రమే కాదు. అది వారి ఆమ్ములపొదిలో ఒక ముఖ్యమైన ఆయుధం. శత్రువుని పూర్తిగా నిర్మూలించటానికి వాడుతున్న ఆయుధం.
జాతీయవాద హిస్టీరియా నిర్మాణం అనేది కేవలం ఒక క్రూరమైన వ్యాపార ఎత్తుగడ కాదు. ఒక విస్తృత కలిసికట్టు వ్యూహంలో ఇదొక భాగం. ఇందులో మిగతా భాగస్వాములు సామాజిక మాధ్యమం, ట్రోల్ సైన్యం, నకిలీ వార్తల పరిశ్రమ. వీరు దేశభక్తి పూరిత పాటలని షేర్ చేస్తూ ఉంటారు. నినాదాలతో, సైన్యం శౌర్య సాహసాల గురించిన వార్తలతో వాట్స్ఆప్ మారుమోగిపోతూ ఉంటుంది. రాజస్థాన్ లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు- ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను ఈ దేశాన్ని తలదించుకోనివ్వను.
సినిమా ప్రపంచానికి చెందిన కొందరు ఇందులో భాగస్వాములుగా ఉండటానికి తెగ ఆరాటపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఒక్కసారిగా పెరిగిన దేశభక్త సినిమాల సంఖ్యని చూడండి. మోదీని, సైన్యాన్ని పొగుడుతూ గత కొన్ని నెలలో విడుదల అయిన సినిమాలు కేవలం యాదృశ్చికం కాదు. “జోష్ ఎలా ఉంది” లాంటి వచనాలు రోజువారి పదకోశంలో చక్కగా చేరిపోయాయి. మణికర్ణిక, ఉరి లాంటి సినిమాలని బాహాటంగానే ప్రశంసించిన మంత్రులు కూడా ఈ వచనాన్ని విరివిరిగా వాడుతున్నారు.
అద్భుతమైన జర్మన్ పదం అయిన Gleischaltung (ఆంగ్లంలో సమన్వయం అని అర్థం) ఇక్కడ బాగా నప్పుతుంది. జర్మనీలో 1933లో హిట్లర్ ఛాన్సలర్ అయిన తరువాత జర్మనీ దేశం మొత్తాన్ని నాజీవాదంతో ఎలా నింపేశారు అనే దానిని ఈ పదం వివరిస్తుంది. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలోనే జర్మనీ దేశం ఏకపార్టీ రాజ్యం అని చట్టాలు చేశారు. ప్రతిపక్షాల వారిని, ప్రత్యర్ధులని కారాగారంలో బంధించటం కానీ, హతమార్చడం కానీ చేశారు. మిగతా పార్టీలని నిషేధించారు. కార్మిక సంఘాలు అన్నీ ఒకరి ఆధీనంలోకి వచ్చేసాయి. దాదాపుగా సమాజంలో, రాజ్యంలో అంగాలన్నీ నాజీల చేతుల్లోకి వచ్చేసాయి.
ఈ ప్రక్రియకి ముఖ్యమైన సాధనం ప్రచారం. జోసెఫ్ గోబెల్స్ ఆధ్వర్యం లోని “ ప్రజా వికాస, ప్రచార మంత్రిత్వ శాఖ’ వార్తాపత్రికలు, పత్రికలు, నాటక రంగం, సంగీతం, కళలు, చివరికి న్యూ మీడియా అయిన రేడియో, సినిమాలని తన ఆధీనంలోకి తీసేసుకుంది. దీనిని వ్యతిరేకించిన వారు ఐతే పారిపోవటమో లేక జైలుకి వెళ్ళటమో జరిగింది. అంత కన్నా ఘోరంగా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆధీనంలోకి తెచ్చుకున్న మీడియాని కేవలం దేశం కోసం, పార్టీ కోసం మాత్రమే కాకుండా హిట్లర్ కోసం వాడటం మొదలయ్యింది. సివిల్ అధికారులు, సైనికులు దేశానికి అలాగే ఫ్యూరర్ కి విధేయంగా ఉంటామని ‘హిట్లర్ ప్రతిజ్ఞ’ చెయ్యవలసి వచ్చింది. నాజీ పార్టీ సభ్యత్వం అమాంతం పెరిగింది.
మనం ఆ స్థాయి అధికార సమన్వయానికి ఇంకా చేరుకుని ఉండకపోవచ్చు. ప్రచార మంత్రిత్వ శాఖ కానీ, ప్రధాన మంత్రికి మన విధేయతని ప్రకటించాలి అని ఒత్తిడి చేసే వేరే మంత్రిత్వ శాఖ కానీ ఇంకా లేవు. కానీ ఆ అవసరం ఏముందని? అధికారికంగా నిర్దేశించకపోయినా జరుగుతున్న ప్రశంసాపూర్వక సమన్వయం అదే.
ప్రైవేటు పౌరులు తమ అభిప్రాయాలని బహిరంగంగా చెప్పవచ్చు. పాకిస్థాన్ తో శాంతి కోరుకునే వారికి మిగతా వారి యుద్ధోన్మాదం వెగటు పుట్టించవచ్చు. అలాగే యుద్ధోన్మాదులకి శాంతి కాముకులని చూస్తే వెగటు పుట్టవచ్చు. సామాజిక మాధ్యమాలలో, వాట్స్ ఆప్ గ్రూపులలో తీసుకుంటున్న అతివాద పక్షాలు దాదాపుగా అసహ్యకరంగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ భావ ప్రకటనాస్వేఛ్చ అంటే అదే.
కానీ మీడియాకి అటువంటి సౌలభ్యం లేదు. నిష్పక్షపాతంగా, సమతుల్యంగా ఉంటూ, వాస్తవాలని రిపోర్ట్ చేస్తూ, అధికార గణాన్ని ప్రశ్నించవలసిన వృత్తిపరమైన నిబద్ధత పాత్రికేయులకి ఉంది. వారు ప్రభుత్వంలో కానీ దాని ప్రచార విభాగంలో కానీ భాగం కాదు. పాత్రికేయులకి వ్యక్తిగత అభిప్రాయలు ఉండవచ్చు కానీ రిపోర్టింగ్ చేసేప్పుడు వాటిని పక్కన పెట్టవలసిన అవసరం ఉంది. అది వారి దేశభక్తికి గీటురాయి కాదు. తమ చదువరులతో వారికున్న వృత్తిపరమైన ఒప్పందం అది.
వృత్తి తత్త్వం అనే మిషని కూడా ఎప్పుడో వదిలేసిన భారతదేశ మీడియా ఈ రోజు దేశ (ప్రభుత్వ అని చదువుకోండి) బాధ్యతలలో భాగం అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నది. వారు తమ జాతీయవాదాన్ని తమ జబ్బల మీద ప్రదర్శించటానికి ఉవ్విళ్లూరుతున్నారు. పాలక పార్టీ రాజకీయాలలో భాగం అవ్వటానికి వారు చాలా సంతోషంగా సన్నద్ధంగా ఉన్నారు. వారు మారతారు అని అనుకోవటం మన అమాయకత్వమే అవుతుంది.
కానీ ఈ సారి మాత్రం వారు చాలా దూరం వెళ్ళారు. ఇందులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అలాగే పరిస్థితులు చేదాటిపోయే అవకాశం చాలా ఎక్కువ. మిగత సమయంలో నిరాటంకంగా పాకిస్థాన్ని ఆడిపోసుకోవటం ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఉన్నది సాధారణ సమయం కాదు. పాకిస్థాన్ అంటే భయానకమైన ద్వేషం ఉన్న వారు నడుపుతున్న ప్రభుత్వం ఉన్నప్పుడు, తామెంత ఘటికులమో చూపించాల్సిన ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రవర్తన చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తియ్యగలదు.
మీడియా నేడు పాడుతున్న కోరస్ ప్రజా అభిప్రాయంగా మార్పు చెందే అవకాశం ఉంది. దానిని ప్రజా మద్దతుగా ప్రభుత్వం భావించే ప్రమాదం కూడా ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నికలలో ఒనగూరే లాభాల గురించి ఆలోచించే వారు కూడా ఉన్నారు. పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది.
అయినప్పటికీ పెద్ద మీడియా సంస్థలు, ప్రాబల్యం కలిగిన మీడియా సంస్థలు చాలావరకూ ఎటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తనని పాటించలేదు. పర దేశీయుల మీద ద్వేషం రెచ్చకొట్టడంలో వారి పాత్ర సిగ్గుమాలినది. దేశ లౌకిక నిర్మాణానికి వారి ప్రవర్తన దీర్ఘ కాలంలో చేటు చెయ్యగలదు. ఈనాటి నడుస్తున్న చరిత్రని లిఖించిన నాడు ఒక ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించడంలో తన వంతు గర్హనీయమైన పాత్ర పోషించిన మీడియా గురించి ప్రత్యేకంగా రాయటం ఖాయం.
సిద్దార్ధ్ భాటియా
ద వైర్ వెబ్సైట్ సౌజన్యంతో