ఛైర్మన్ హెచ్చరించినా రాత్రి మరో ట్వీట్…
సీఎం జగన్ ఏం చేస్తారు…పక్కన పెడతారా..!
టీటీడీలో ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఆగమ సలహాదారుడిగా ఉన్న రమణ దీక్షితుల మధ్య సాగుతున్న కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. అర్చకులకు కరోనా సాకుతుందని..దర్శనాలు ఆపమని కోరినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ..నిర్ణయం తీసుకోకుంటే విపత్తు తప్పదని రమణ దీక్షితులు ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు ట్వీట్ చేసారు.
ఇది వివాదాస్పదంగా మారింది. దీని పైన ఛైర్మన్ సుబ్బారెడ్డి సైతం సీరియస్ అయ్యారు. ఏదైనా ఉంటే నేరుగా చెప్పే అధికారం ఆయనకు ఉందని..ఈ విధంగా ట్వీట్ చేయటం సరికాదని మండిపడ్డారు. అయితే, రమణ దీక్షితులు మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. శుక్రవారం రాతరి మరో ట్వీట్ చేసారు. ఇది ముందురోజు చేసిన ట్వీట్ కు కొనసాగింపుగా ఉంది. అయితే, ఈ సారి సీఎంతో పాటుగా టీటీడీ ఛైర్మన్ ను శ్రీవారి దర్శనాలను రద్దు చేయాలంటూ అభ్యర్ధించారు. మరి..ఇప్పుడు ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి ఏం చేస్తారు.. రమణ దీక్షితులను పక్కన పెడతారా..ఆయన సూచనలను అమలు చేస్తారా…
రెండో ట్వీట్ తో మరోసారి సంచలనం….
టీటీడీ ఆగమ సలహాదారుడు రమణ దీక్షితులు మరోసారి ట్వీట్ చేసారు. తొలి ట్వీట్ మీద రభస జరిగినా ఆయన పట్టించుకోలేదు. తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా శ్రీవారి దర్శనాలను నిలుపుదల చయేాలని సీఎంతో పాటుగా ఛైర్మన్ ను ట్వీట్ ద్వారా కోరారు. శ్రీవారి అర్చకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేనిదని..వారి ఆరోగ్య పరిరక్షణను పరిగణలోకి తీసుకొని దర్శనాలను నిలుపుదల చేసి ఏకాంతంగా సేవలు కొనసాగించాలని అభ్యర్ధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి కైంకర్యాలు ఒక్కరోజు కూడా ఆగటానికి వీల్లేదని ఇది మానవజాతికి మంచిది కాదని పేర్కొన్నారు. కొన్ని వారాల పాటు దర్శనాలను నిలపుదల చేసి శ్రీవారి కైంకర్యాలనున ఏకాంతంగా నిర్వహించాలని ట్వీట్ లో రమణ దీక్షితులు కోరారు.
సుబ్బారెడ్డితో ఢీ కి సిద్దం..సీఎం ఏం చేస్తారు..
తొలి సారి ఇదే అంశం పైన రమణ దీక్షితులు ట్వీట్ చేయగానే..ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన టీటీడీ ఆగమ సలహాదారుడిగా ఉన్నారని..ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా సీఎం కు దర్శనాల గురించి చెప్పటం సరి కాదని ఆగ్రహించారు. అయినా..రమణ దీక్షితులు ఛైర్మన్ మాటలను పట్టించుకున్నట్లుగా కనిపించటం లేదు. తన తొలి ట్వీట్ వివాదాస్పదం అయినా మరలా ట్విట్టర్ ద్వారా నే తన అభ్యర్ధన సీఎంతో పాటుగా సుబ్బారెడ్డికి తెలిపారు. దర్శనాల నిలుపుదలకు టీటీడీ బోర్డు…అధికారులు సిద్దంగా ఉన్నట్లు కనిపించటం లేదు. దీంతో..రమణ దీక్షితుల వ్యవహారం పైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటానికి సుబ్బారెడ్డి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా..మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేసారనే కారణంతోనే సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కు ప్రభుత్వం షో కాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాను ఏరి కోరి తెచ్చి..మరీ పదవి ఇచ్చిన రమణ దీక్షితుల వ్యవహారం పైన ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. పక్కన పెడతారా..లేక హెచ్చరించి ఛైర్మన్..దీక్షితుల మధ్య వివాదానికి ముగింపు పలుకుతారా అనేది తేలాల్సి ఉంది.