మొన్న సజ్జల..నేడు సుబ్బారెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?వారి హవా నియంత్రించేందుకా..పరోక్ష హెచ్చరికలా..?
ముఖ్యమంత్రి జగన్ తీసుకొనే నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. పార్టీలో..ప్రభుత్వంలో ఆయన తన నిర్ణయాల్లో పార్టీ నేతలకు పజిల్ గా మారుతున్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల వరకు తొలి నుండి తనతో క్రియా శీలకంగా వ్యవహరించి..ఇక రకంగా జగన్ తరువాతి స్థానంలో తామే అనే భావనలో ఉన్న ముగ్గురు నేతలకు ఇప్పుడు జగన్ జలక్ లు ఇస్తున్నారు.పార్టీలో వారి ప్రాధాన్యత అధికారం లోకి వచ్చిన తరువాత మరింతగా పెరిగింది.
వారికి అధికారిక పదవులు ఇచ్చి…ఇక రకంగా జగన్ సైతం కోటరీ నడుపుతున్నారనే భావనకు కారణమయ్యారు. అయితే, ఆ ముగ్గురు కీలక నేతల అధికారాలకు సీఎం జగన్ చెక్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు..తన తరువాతి స్థానం పార్టీలో ఆ ముగ్గురిదే..అందునా ఆ రెడ్డి నేతలదే అనే భావన తొలిగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారుడు..జగన్ ఆప్తుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి వద్ద ఉన్న పార్టీ బాధ్యతలను తగ్గించిన జగన్..ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి జలక్ ఇచ్చారు. పూర్తిడి రెడ్డి నేతలే పెత్తనం చేస్తున్నారనే విమర్శల నడుమ వైవీ స్థానంలో బీసీ నేతకు ప్రాధాన్యత ఇచ్చారు.
వైవీకి కోత విధించిన అధికారాలు తాజాగా రాజ్యసభకు ఎంపికైన మోపిదేవికి అప్పగించారు. ఇక, జగన్ ఇదే తరహాలో విజయ సాయి రెడ్డి బాధ్యతల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారనే వాదన పార్టీలో మొదలైంది.సజ్జల..సుబ్బారెడ్డి అధికారాలు..బాధ్యతలు తగ్గింపు…జగన్ పార్టీ ఏర్పాటు నుండి ఆయనతో కలిసి..ఆయనకు అండగా నిలుస్తున్న వారిలో విజయసాయిరెడ్డి…వైవీ సుబ్బారెడ్డి..సజ్జల రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఈ ముగ్గురికి ప్రాధాన్యత..కీలక భూమిక ఉండేది. పార్టీ నుండి తొలి రాజ్యసభ సభ్యుడుగా విజయసాయిరెడ్డి..దాదాపు జగన్ తరువాత పార్టీలో నెంబర్ టు స్థానంలో నిలిచారు. జగన్ పాదయాత్ర..2019 ఎన్నికల సమయంలోనూ మొత్తం 13 జిల్లాలను జగన్ ఈ ముగ్గురికి అప్పగించారు.
ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డికి..మిగిలిన 10 జిల్లాలను సజ్జల..వైవీలకు కేటాయించారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి వరకు ఒంగోలు ఎంపీగా ఉన్న సుబ్బారెడ్డికి జగన్ టిక్కెట్ నిరాకరించి..టీడీపీ నుండి వచ్చిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి కేటాయించారు. ఆ సమయంలో వైవీ కొద్ది రోజులు జగన్ కూ దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యుల జోక్యంతో ఆయనకు టీటీడీ ఛైర్మన్ గా హామీ లభించింది. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన టీటీడీ ఛైర్మన్ గాకా..సజ్జల ముఖ్యమంత్రి వద్ద..ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. విజయ సాయి రెడ్డి అటు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ..రాజకీయంగా కీలకంగా మారారు. ఈ సమయంలో …ముఖ్యమంత్రి జగన్ అనూహ్యంగా వారికి గతంలో అప్పగించిన పార్టీ పరమైన బాధ్యతల్లో కోతలు విధిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే సజ్జలకు అప్పగించిన జిల్లాల్లో రెండింటిని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి అప్పగించారు. కాగా, తాజాగా వైవీ సుబ్బారెడ్డికి అప్పగించిన జిల్లాలకు సీఎం కోత పెట్టారు. నియంత్రణా..హెచ్చరికలా…!!పార్టీలో తన తరువాత ముగ్గురు నేతలే కీలకంగా వ్యవహరించటం..వారే పార్టీలో ముఖ్యం అనే భావన తొలిగించటం..అందునా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి తాను ప్రాధాన్యత ఇస్తున్నాననే విమర్శలకు దూరంగా ఉండటం కోసం సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా..టీటీడీ ఛైర్మన్ గా ఉంటూ టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు రావటం..అవి ప్రభుత్వ ఇమేజ్ కు నష్టం చేసే విధంగా ఉండటం..వాటిని వెంటనే తిప్పి కొట్టటంలో వైసీ సుబ్బారెడ్డి అండ్ కో సమర్ధవంతంగా పరిష్కరించలేకపోతుందనే భావన పార్టీలో వ్యక్తం అవుతోంది.
ఇదే సమయంలో ఆ ముగ్గురే కాకుండా పార్టీ బాధ్యతలను ఇతర నేతలకు పంచటం ద్వారా వీరి హవాకు చెక్ పెట్టటం ఒక కోణం అయితే…పార్టీలో ఎవరైనా తమకు తిరుగులేదని భావిస్తే సహించబోననే సంకేతాలను జగన్ ఇచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా వైవీ సుబ్బారెడ్డికి అప్పగించిన అయిదు జిల్లాల్లో గుంటూరు..క్రిష్ణా జిల్లాల్లో పార్టీ బాధ్యతలను మోపిదేవి వెంకట రమణకు జగన్ అప్పగించారు. దీని ద్వారా రెడ్డి సామాజిక వర్గానికే కాకుండా బీసీలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా జగన్ సంకేతాలిచ్చారు.
ఇప్పటి వరకు జగన్ వద్దకు వెళ్లాలన్నా..ఏం జరగాలన్నా..ఆముగ్గురిలో ఒకరి ద్వారా మాత్రమే సాధ్యమనే పరిస్థితులు త్వరలో మారుతుందని పార్టీ నేతలు తమ అధినేత నిర్ణయాలకు మద్దతిస్తున్నారు. ఇదే సమయంలో వీరిద్దరే కాకుండా త్వరలో నెంబర్ టూగా పార్టీలో ప్రచారంలో ఉన్న విజయ సాయిరెడ్డికి కోతలు ఉంటాయనే చర్చ పార్టీలో మొదలైంది. దీంతో..జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆయన కోటరీలోని ముఖ్యులకే పెద్ద పజిల్ గా మారుతోంది.