Bimbisara: ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నప్పటికి సరైన హిట్లు లేక సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు నిలదొక్కుకోలేకపోతున్నారు. మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. తెలుగు సినీ తెరపైనా, వెనుకా అతి పెద్ద కుటుంబానికి వారసుడిగా ఉన్న కళ్యాణ్ రామ్ తన మార్క్ లో సరైన హిట్ కొట్టి దశాబ్దం దాటింది. అప్పుడెప్పుడో “అతనొక్కడే“తో సూపర్ హిట్ అందుకున్నారు. నాలుగేళ్ళ కిందట పటాస్ హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ హీరో కంటే డైరెక్టర్ అనిలా రావిపూడికే మైలేజి అయింది. కళ్యాణ్ రామ్ కి ఆ సినిమా హిట్ ప్రయోజనాలు ఏమి రాలేదు. కెరీర్ ఊపందుకోలేదు. అందుకే ఇన్నాళ్లకు మళ్ళీ ప్రయోగాల బాట పట్టారు. చారిత్రిక అంశంతో “బింబిసారా” అంటూ వస్తున్నారు. ఇటీవల విడుదల చేసి మొదటి లుక్, పేరు, లోగో అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు నుండి తాజా అప్డేట్ వింటే నందమూరి ఫాన్స్ కి పూనకాలు ఆగవు..
మూడు భాగాలుగా.. మొదటి భాగం రెడీ..!!
ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా రానుంది. తెలుగు తెరపై భాగాల సినిమాలు బాహుబలితో మొదలయ్యాయి. బాహుబలి ఒకటి, రెండు తర్వాత.. పుష్ప కూడా రెండు భాగాలుగా తెస్తామని ప్రకటించారు. ఇక ఈ బింబిసారా మూడు భాగాలుగా రానుంది. నిజానికి మొదట దీన్ని ఒక భాగంగానే అనుకున్నారు. కానీ కథని పెంచి, మంచి సీన్లు కలిపి మరో రెండు భాగాల కథని రాసుకున్నారు. దీనిలో భాగంగా మొదటి భాగం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా రెండో దశ తర్వాత సంక్రాంతిలోగా విడుదల చేయాలనే సన్నాహాల్లో ఈ టీమ్ ఉంది. మిగిలిన రెండు భాగాలను 2022 లోనే విడుదల చేయాలనే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో వసిష్ఠ మల్లిడి దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.., జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు..