ఆయన చెప్పిందొకటి… వీళ్లు అర్థం చేసుకుంటుందో మరోటి…
రాజధాని విషయంలో ఫైనల్ రాష్ట్రమే…
అమరావతి రాజధాని విషయంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో మర్మం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కొందరు మాత్రం… రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లోని కొన్ని అంశాలనే తీసుకొని వాటినే ప్రచారం చేస్తున్నారు. అవును రామ్ మాధవ్ రాజధాని విషయంలో రాష్ట్రం హక్కులను కాదనలేమని విపరీతమైన క్లారిటీతో చెప్పారు. రాజధాని నిర్ణయించుకోవడం అన్నది రాష్ట్రం హక్కు అని… రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్లో కేంద్రం ఎన్నటికీ జోక్యం చేసుకోబోదని చెప్పారు. కానీ అదే సమయంలో రామ్ మాధవ్ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యల్లోని అసలు వాస్తవాలను మాత్రం ఆ మీడియా, ఆ పార్టీ, అమరావతి జేఏసీ నాయకులు మరోరకంగా తీసుకోవడం విడ్డూరం.
హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు వచ్చారు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని… గవర్నర్ అందుకు ఆమోదం తెలిపారని… దాన్ని గౌరవిస్తూ, కేంద్రం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు రామ్ మాధవ్. మొత్తంగా… రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకొదని… రాజ్యాంగ పరమైన విషయాలను గౌరవిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. 2014లో గెలిచిన చంద్రబాబుకు హైదరాబాద్ లో పదేళ్లు ఉండి… మంచిగా రాజధాని కట్టుకోమని చెప్పామని… కానీ ఆయన హైదరాబాద్ నుంచి అమాంతంగా పరిగెత్తుకు విజయవాడ వచ్చి… అద్దె ఇళ్లల్లో ఉండి… ప్రభుత్వం కార్యకలాపాలు నడిపారని… బస్సులో ముఖ్యమంత్రి సచివాలయ కార్యకలాపాలు నిర్వహించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… కేంద్రం ఇన్వాల్వ్ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే రాజధానిలో నిర్మాణాల కోసం కేంద్రం రూ. 2500 కోట్లిచ్చిందని… అదే సమయంలో నిర్ణయాల విషయంలో అస్సలే జోక్యం చేసుకోలేదని… ఇప్పుడు కూడా అదే వైఖరి అవలంబిస్తామన్నారు రామ్ మాధవ్.
అన్నీ మంచి శకునములే…
మొత్తంగా రామ్ మాధవ్ చాలా క్లారిటీ ఇచ్చేశారు. మొత్తంగా కేంద్రం నుంచి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు పూర్తి భరోసా వచ్చేసినట్టే. ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్న రాజధాని అంశం త్వరలోనే కొలిక్కే రాబోతుందన్న అభిప్రాయం రామ్ మాధవ్ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చేమో. అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలన్న అంశమే ప్రధానమంటూ రామ్ మాధవ్ చెప్పడం చూస్తే… త్వరలో ఏం జరగబోతుందో క్రిష్టల్ క్లియర్ గా చెప్పేశారు. అందుకు పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని… అప్పుడే ప్రజల నుంచి పార్టీకి ఆదరణ వస్తుందని… మభ్యపెట్టే రాజకీయం బదులు క్లారిటీ అవసరమన్నారు రామ్ మాధవ్.
మూడు రాజధానుల్లో కరెప్షన్పై పోరాటం
అదే సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు కడతామంటే అందులో జరిగే అవినీతి తప్పక ప్రశ్నిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని… ఏపీకి నాలుగు రెట్లున్న యూపీకి ఒకటే రాజధాని ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒక రాజధాని విషయంలో ఎంతో కరెప్షన్ కళ్ల ముందు చూశామని… మూడు రాజధానుల కరెప్షన్ కు వ్యతిరేకంగా పార్టీ పోరాడాల్సి ఉందన్నారు. అమరావతి చిట్టచివరి రైతుకు మేలు జరిగేలా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మూడు రాజధానుల అంశం అవినీతికి ఆలవాలం కాకుండా… అమరావతిలో నష్టపోతున్న రైతులకు మేలు కలిగేలా బీజేపీ ఒక కీలక పాత్ర పోషించాలన్నారు. జూనియర్ పార్టనర్ మనస్తత్వం వీడాలని… డామినెంట్ పార్టీగా ఎదగాలంటే నేతల మైండ్ సెట్లో మార్పు రావాలన్నారు రామ్ మాధవ్
అపోజిషన్గా టీడీపీ ప్లేస్ను భర్తీ చేయాలి
ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదని… ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన నేతలకు సూచించారు. టీడీపీ స్థానంలోకి బీజేపీ రావాలని… అందుకు కావాల్సిన వాతావరణం ఇప్పుడు సిద్ధంగా ఉందని పార్టీ నేతలుకు చెప్పారు రామ్ మాధవ్. వాస్తవానికి టీఆర్ఎస్ అయినా, వైసీపీ అయినా ప్రతిపక్షం బలంగా ఉండకూడదని కోరుకుంటుందని… కానీ బీజేపీ కన్సస్ట్రక్టివ్ అపోజిషన్ గా… క్రిటికల్ ఫ్రెండ్ గా పనిచేయాలని… నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ… ప్రభుత్వ నిర్ణయాల్లోని లోటుపాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రం ఇంటరెస్ట్ కోసం పోరాడినప్పుడే పార్టీకి ఏపీలో ఊపు వస్తుందని అంతే తప్పించి మోదీ పేరు చెప్పుకుంటే ఒరిగేదేమీ ఉండదని… కష్టపడితేనే లైఫ్ అంటూ రామ్ మాధవ్ హితోపదేశం చేశారు.