దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే కరోనా మాయదారి రోగంపై సందేహంతో పరీక్షలు చేయాలన్న వారికి.. అక్కర్లేదంటూ తెలంగాణలో ఆచితూచి మాత్రమే పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందనడానికి ఈ ఉదంతం దర్పణం పడుతోంది. తెలంగాణ హైకోర్టులో ఒక ఉద్యోగిని ఒక న్యాయమూర్తి పలుకరించారు. మీ ఇంట్లో అంతా బాగున్నారా? అని ఆయన ఆరా తీశారు. మా అన్నయ్యకు ఆస్తమా ఉంది,ఈ మధ్యన కాస్త ఇబ్బంది పడుతున్నాడని సదరు ఉద్యోగి సమాధానమిచ్చాడు. ఎందుకైనా మంచిది అతడికి కరోనా పరీక్షలు చేయించండి అని హైకోర్టు జడ్జి సలహా ఇచ్చారు.
ఆయన ఆదేశాల మేరకు అధికారులు సదరు ఉద్యోగి సోదరుడితో పాటు ఇంట్లో ఉన్న పద్నాలుగు మందికి టెస్టులు చేశారు. ఆ పరీక్షల్లో అందులో ఏడుగురికి కరోనా పాజిటివ్గా రిపోర్టులు వచ్చాయి.వారుని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కనుక పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివు కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రమత్తమవుతారేమో వేచి చూడాలి!