తెలుగు న్యూస్ ఛానళ్ల పోకడలు పరిశీలిస్తే ఈ ఎన్నికలు రాజకీయపక్షాలకా లేక న్యూస్ ఛానళ్లకా అన్న సందేహం రాకమానదు. రాజకీయ నాయకులలో లేని ఆతురత, దబాయింపు ధోరణి ఛానల్ యాజమాన్య ప్రతినిధులయిన యాంకర్లలో కనబడుతున్నది. ఇటీవల తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు సైతం న్యూస్ ఛానళ్లు ఇలాగే హోరాహోరీగా పోరాడాయి. వాస్తవ సమాచారం కాకుండా తామే కొత్త ప్రతినిధులనూ, సర్వేలనూ రూపొందించుకుని కార్యక్రమాలు నడిపాయి. కేవలం మీడియా మీద ఆధారపడేవారికి కెసిఆర్కు పరాజయం తప్పదు అనే భావన కలిగేలా ఛానళ్లు, పత్రికలు నడిచాయి. చివరికి ఛానళ్లు ఊదరగొట్టినట్లు కాకుండా టిఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. సెంటిమెంట్ ప్రజ్వరిల్లింది కనకనే చివరి దశలో కెస్ఆర్ పార్టీ విజయం వేపు ఒరిగింది అనే విశ్లేషణ మీడియా తనకు తానే చేసుకుంది. నిజానికి ఈ సూత్రీకరణకు ఏ ఆధారం లేదు. అన్నీ ఊహాగానాలే. బ్యాలెట్లోని ఓట్ల సంఖ్య తప్ప మరో మార్గం లేదు.
ఇప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ – సమయం చాలా తక్కువ ఉంది కనుక – రాజకీయ పార్టీలను మించిన ఉత్సాహం, ఆతురత న్యూస్ ఛానళ్లలో కనబడుతోంది. ఏ న్యూస్ ఛానల్ ఎవరి పక్షమో ఆ ఛానల్ చెప్పనక్కర లేదు. న్యూస్ ఛానల్లో ఏ రంగు పార్టీ విజువల్స్ కనబడితే అది ఆ రాజకీయ పార్టీ వైపు అని సులువుగా చెప్పవచ్చు. ఎక్కువ అనుకూల అంశాలు జోడించడం, తమకు నచ్చని పక్షం గురించి విమర్శలు మాత్రమే చూపి, తాము కూడా న్యూట్రల్ అని ప్రకటించుకోవడానికి ప్రయత్నించడం ఒక ధోరణి. యాంకర్ మహాశయులు తమ పార్టీ సుగుణాలనయినా, ప్రతిపక్ష పార్టీ (ఛానల్ యాజమాన్యం వ్యతిరేకించే పార్టీ) చెడు పోకడలనయినా – తాను చూసినట్లు ముందుబడి సమర్ధించడం లేదా ఖండించడం మరో పోకడ. అలాగే రాజకీయ విశ్లేషకులు కొందరు కొన్ని ఛానళ్లలోనే కనబడి దాదాపు రాజకీయ నాయకులైనంత పని చేస్తారు. సినీ నటుడు శివాజీ, మత ప్రచారకుడైన కెఎ పాల్ హఠాత్తుగా వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ పోతారు. ఆ తర్వాతి లైవ్ షోకి వచ్చిన గెస్టులు వెనుతిరిగే అగత్యం కలుగుతుంది.
నిజానికి మీడియా అంచనాలు తారుమారు కావడం కొత్త కాదు. మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు చెప్పిన సంగతులూ, చేసిన విశ్లేషణలూ ఎన్నో సార్లు దారి తప్పాయి. మరో విషయం ఏమంటే ఎన్నికల ముందు అనేక సర్వేలు జరుగుతాయి. ఆ సర్వేల ఫలితాలు విశ్లేషిస్తారు. వీటి నిర్వహణకు వందలాది కోట్ల రూపాయలు వ్యయమవుతున్న సంగతి కొంత లోతుగా పరిశీలిస్తున్న వారికి బాగా తెలిసిన విషయమే. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? నష్టాలతో నడిచే న్యూస్ ఛానళ్లు ఇలాంటి అదనపు ఖర్చును ఎలా ఎందుకు భరిస్తాయి? ఈ సర్వేల ఖర్చు ఏమూల నుంచి వస్తోందని మేధావులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
తెలుగు మీడియా తెలంగాణా కారణంగా మరో పోకడ పోతోంది. దాదాపుగా
ఒక దశాబ్ద కాలంగా ఇక్కడి మాటలు ఇక్కడ, అక్కడి మాటలు అక్కడ నడుస్తున్నాయి. టెలివిజన్ స్క్రీన్ మీద కాసేపు ఆంధ్రప్రదేశ్, కాసేపు తెలంగాణా అని చూపినట్లు – పత్రికలలో ఇక్కడికి ఒక తొలి పేజీ, అక్కడికి ఒక తొలి పేజీ మార్చడం సహజమై పోయింది. పత్రికలలో కొన్ని వ్యాసాలు ఒక ఎడిషన్లో ఇచ్చి, వేరే వ్యాసాలు అక్కడి ఎడిషన్లో ఇవ్వడం ఉండేది. ఒకే అంశమైనా తొలి పేజీలో ఓరియెంటేషన్, హెడ్డింగ్ వేరుగా ఉండేవి. గత ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్తపలుకు రెండు రకాలుగా పలకడమే కాదు, పలికినట్లు న్యూమీడియా ద్వారా ఎక్స్పోజ్ అయిపోయింది.
సాక్షి ఛానల్ వైఎస్ఆర్ పార్టీ ఛానల్ అని సులువుగా గుర్తించవచ్చు. కానీ ఇతర రెండు పెద్ద పత్రికలు, ఐదారు ఛానళ్లు – ఎబిఎన్, టివి9, ఈటివి, మహాటివి, ఎన్టివి, టివి5 వంటివి – న్యూట్రల్ అని చెప్పుకుంటూనే ఒక పార్టీ ప్రచారానికీ, రెండో పార్టీపై విమర్శలకూ పరిమితం అవుతున్నాయి. కనీసం రెండు గ్రూపులుగా ఉన్నాయి కనుక ఒకరు చెప్పనివి మరొకరు చెబుతున్నారు. అలా కాకుండా ఒకే గ్రూపుగా ఉండి ఉంటే వాస్తవం ఎక్కడికి పోయి ఉండేది? ప్రజల అరిచేతుల్లో ఇమిడిపోయే, రెండు గ్రూపుల కుళ్లు కడిగే న్యూమీడియా ఉంది కాబట్టి సరిపోయింది. న్యూమీడియా ద్వారా అప్పటికప్పుడు రిటార్ట్ చేసే వ్యాఖ్యలు ప్రజలకు చేరిపోతున్నాయి. ఈ సదుపాయం లేకపోయి ఉంటే ప్రధాన స్రవంతి మీడియా ముష్టి ఘాతాలకు వార్త, వాస్తవం ఏమైపోయేవో?
ఛానళ్లు ఎంతగా చొక్కాలు చించుకున్నా ప్రజలు ఎవరోమిటో గమనిస్తూనే ఉన్నారు. అయితే ఒక విషయం ఏమిటంటే డైలీ సీరియళ్లను మించి ఎన్నికల వినోదం వీక్షకులకు అందుతోంది. కనుక ఎన్నికల కాలంలో సీరియళ్లు చూపే ఎంటర్టైన్మెంట్ ఛానళ్లకు రేటింగ్ తగ్గి న్యూస్ ఛానళ్లకు పెరిగినా ఆశ్చర్యం లేదు.
-నాగసూరి వేణుగోపాల్