వార్తలిచ్చే టివి9 వార్తగా మారింది.
టిఆర్పి వార్తలు రాసే ప్రముఖుడు ఏకంగా టిఆర్పి వార్తా వస్తువయ్యాడు.
భారత్ వర్ష్ హిందీ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవంలో ప్రధానితో వేదిక మీద కూర్చున్న ఒకే ఒక్కడు రవిప్రకాష్ సంచలన విమర్శలకు కేంద్రబిందువయ్యాడు.
సోమవారం ఈ వ్యాఖ్య రాసే సమయానికి ఆయన వార్తలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆయన ఇంకా ఎంక్వయిరీకి హాజరు కాలేదు. వెళ్లకపోతే సెక్షన్ మారుతుంది. సమస్య మరింత జటిలంగా మారుతుందని వార్తలు వెలువడుతున్నాయి. మరోవేపు ఆయన ఐన్యూస్కు వెళ్లవచ్చనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలిరోజు కొన్ని ఛానళ్లు – 10టివి, సాక్షి టివి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చాలసేపు ఈ వార్తను చూపించాయి. 10టివి మరింత పరిశోధనతో మోసం ఎక్కడా ఎలా అంటూ విశ్లేషించే కార్యక్రమాలను ప్రసారం చేసింది. సాయంకాలానికి ఎబిఎన్ రవిప్రకాష్ వార్తలు తగ్గించింది. 10టివి వ్యాఖ్యలతో కూడిన వివరణలు పెంచింది. తమాషా ఏమిటంటే టివి9 చమత్కారంగా మూడు గంటల బులెటిన్లో ఈ వార్త ఇవ్వకపోగా, వేసవిలో మామిడి తింటే ఏమి, తినకపోతే ఏమి అనే రీతిలో న్యూస్ కానిదాన్ని వివరంగా ప్రసారం చేసింది. అంతేకాదు, టివి9 కొత్త యాజమాన్యం నిర్వహించే ప్రెస్ మీట్ ప్రసారం చేస్తుందా అనే రీతిలో సాగింది రెండవ రోజు. మొదటి రోజు రాత్రి 9 గంటలకు రవిప్రకాష్ నేరుగా స్క్రీన్ మీదకు వచ్చి వార్తా ఛానళ్లు విలువలతో సాగాలని సహృదయ హితబోధ చేశారు. సహృదయ ఎందుకంటే తన గురించి వార్తలు ప్రసారం చేసిన ఛానళ్లకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన మొత్తం బులెటిన్ చదివి ఉంటే సదేహం ఉండేది కాదు. కేవలం తన ఆచూకీ చెప్పడానికి అన్నట్లు చేసిన ప్రకటన లైవ్ కాదా అని సోషల్ మీడియాలో కొందరు చర్చ చేశారు. అలా ఎందుకు చేశారో వారికే తెలియాలి. ఈ వార్త చూసిన వేళ నుంచి రెండవ రోజు ప్రెస్మీట్ దాకా టివి9 తీరు గురించి కొత్త యాజమాన్యం ప్రకటన చేస్తే బావుంటుంది.
ఈ సందర్భంగా మరింత చర్చించుకునే ముందు స్పందన తీరును గమనించాలి. సోషల్ మీడియా లేకపోతే మనకేమాత్రం ఇలాంటి వాటి విషయంలో బోధపడి ఉండేది కాదు. జర్నలిస్టులు సంస్థల ద్వారా కాకుండా ఫేస్బుక్ ద్వారానే బాగా స్పందించారు. ఈ స్పందనలలో వారి వైఖరి వారి తీరు బట్టి ఉంటే – స్థూలంగా మీడియాను ఎంతోకొంత సమర్ధించే తీరు కనబడింది. మినహాయింపుల వ్యూహాలు వేరుగా ఉండొచ్చు. ఇక్కడ కూడా టివి9కు ఇదివరకు పని చేసిన నంద్యాల జర్నలిస్టు రామకృష్ణారెడ్డి చెబుతున్న సమాచారం రవిప్రకాష్కు సంబంధించి ఒక పార్శ్వాన్ని ఆవిష్కరిస్తే, టివి9 వదిలి జెమినీ న్యూస్లో చేరిన సాయి చెబుతున్న విశేషాలు మరో పార్శ్వాన్ని అందజేస్తున్నాయి. వీరిద్దరూ తమ పాత్రికేయ అనుభవాలను వివరించి చెప్పారు, అంతే. ఇవన్నీ ఒకతీరు. సామాన్యులు స్పందిస్తున్న తీరు మరోరకం. ఏమాత్రం మినహాయింపులు లేని వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడింది. మీడియా దుర్వినియోగం పట్ల, వంచిస్తున్న మీడియా ప్రముఖుల పట్ల ప్రజలలో స్పందనకు కొలమానంగా ఈ పోకడను పరిగణించాలి. ఈ వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో గమనించడానికి ఇటువంటి సందర్భాలు ఉపయోగపడతాయి.
రవిప్రకాష్ ప్రతిభావంతుడు కాదని ఎవరూ అనడం లేదు. అయితే ఆయన ప్రతిభ నైపుణ్యం ఏ తీరున సాగాయి, మంచి చేశాయా, చెడు చేశాయా, ఎవరికి ఉపయోగపడ్డాయి, ఎవరిని నాశనం చేశాయి అనే కోణాలు అవసరం. వీటిని ప్రస్తావించకుండా వివరణను ముగించలేము. ఇప్పడు ఆయన ఛానల్ ద్వారా చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు మీడియాలో గతంలో విజయవిహారం పత్రికా సంపాదకుడికి సంబంధించి వెలువడిన సంచలనం తర్వాత ఇది అదే తీరులో మరింత పెద్దదిగా కనబడుతోంది. ఇటువంటి జర్నలిస్టు మేధావులను పరిశీలించినపుడు, న్యూఢిల్లీ టైమ్స్ పేరుతో రెండుమూడు దశాబ్దాల క్రితం వెలువడిన సినిమా గుర్తుకువస్తోంది.
కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన సంస్థ కొత్త ఛానల్ ప్రారంభించినపుడు యజమాని కాకుండా సంపాదక స్థాయి వ్యక్తి ప్రధానితోపాటు వేదిక అలంకరించడం పరిశోధనాంశం. సందేహం లేదు, మేధావులు యజమానుల కన్నా పైచేయిగా ఉండాలి. ఇది ఆదర్శం. పెద్ద టెక్నాలజీ, భారీ పెట్టుబడి, విశేషమైన పలుకుబడి, గొప్పస్థాయి రాజకీయప్రయోజనం ఉన్న చోట పెట్టుబడి చేతులు ముడుచుకుని ఉండదు. ఇక్కడెలా జరిగింది.
ప్రభావం, అధికారం, రాజకీయంగా మారిన మీడియా నేడు పరిశోధన చేసే పరిస్థితిలో లేదు. రాజకీయం, వాణిజ్యం, ప్రజలను చేరగలగడం అనే ధర్మాలతో మీడియా కూడా ప్రజలను ఏదోరకంగా నియంత్రించడానికో, వారికి ఏదో రకమైన నష్టం చేకూర్చడానికో సిద్ధమవుతోంది. ఈ దశలో సృజనాత్మకత పొంగిపొరలుతోంది. ఫలితంగా ప్రభుత్వ ధనానికో, ప్రజల హక్కులకో ఇది సమస్యగా మారింది. చాలమంది సామాన్యులు భావిస్తున్నట్లుగా అభియోగం నిజమైందా, రుజువు అవుతుందా అనే ప్రశ్నలు ఒకవైపు, చేసిన నేరానికి శిక్ష పడుతుందా లేక కొత్త యాజమాన్యం సర్దుకుంటుందా లేదా రాజకీయ నాయకులు ప్రవేశించి కథ సుఖాంతమవుతుందా అనే ప్రశ్నలు మరోవైపు ఉన్నాయి.
కానీ సమాచారం, ప్రజోపయోగం, మేధ అనే ముసుగు కప్పుకున్న గెరిల్లా జర్నలిజం మాత్రం తప్పకుండా తగ్గాలి. ఫేక్న్యూస్గా పిలవబడే గెరిల్లా జర్నలిజానికి ముక్కుతాడు వేసే చట్టాలు మాత్రం రాక తప్పదు.
డా. నాగసూరి వేణుగోపాల్