అమరావతి: వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో మల్లాది రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం మల్లాది టీటీడీ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు.
మల్లాది విష్ణు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం 2014లో టీడీపీ నేత బోండా ఉమా చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు సెంట్రల్ టికెట్ పై జగన్ హామీ ఇచ్చారు. అప్పుడు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా అదే టికెట్ కావాలని పట్టుబట్టారు. కానీ, జగన్ మాత్రం మల్లాది విష్ణువైపే మొగ్గు చూపించారు. దీంతో వంగవీటి రాధా వైసీపీకి దూరం అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాది విష్ణు విజయం సాధించారు.