మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్నతో గౌరవించడం ద్వారా బిజెపి ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వదలచుకొన్నది? చాలా దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్నందుకు, అనేక పదవులను ప్రతిభావంతంగా నిర్వహించినందుకు ప్రణబ్దాకు మోదీ ప్రభుత్వం నిస్వార్ధంగా అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిందని అనుకోనక్కర లేదు. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చేయరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితం అయింది.
ఒక ప్రయోజనం కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడం. కాంగ్రెస్పై పదేపదే కుటుంబ పాలన ఆరోపణ చేసే ప్రధాని, గతంలో చాలాసార్లు భారత ప్రధమ ఉపప్రధాని వల్లభాయ్ పటేల్ విషయంలో కాంగ్రెస్ అన్యాయంగా ప్రవర్తించిందనీ, ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదనీ ఆరోపిస్తూ వచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ బదులు పటేల్ ప్రధాని అయిఉంటే దేశ చరిత్ర మరో విధంగా ఉండేదని బిజెపి ఉద్ఘాటిస్తూ వస్తోంది.
ప్రణబ్ ముఖర్జీ విషయంలో కూడా కాంగ్రెస్ను ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ధ్యేయంగా ఆయనకు భారతరత్న ప్రకటించినట్లు కనబడుతోంది. ప్రణబ్ జీవితాంతం కాంగ్రెస్ వాది. 2004లో మన్మోహన్ సింగ్ బదులు ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేసి ఉండాల్సిందని కాంగ్రెస్లోనే కొందరి అభిప్రాయం. ప్రధానమంత్రి పదవికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉండి కూడా పదవి చేపట్టలేకపోయిన నేత ప్రణబ్.
ప్రణబ్ను ప్రధాని చేసేందుకు అంగీకరించలేక పోయిన సోనియా గాంధీ తర్వాత ఆయనను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. అది కూడా ఆమె మొదట సంకోచించకుండా చేసిన పని కాదు. చివరికి తప్పలేదు.
ఇది ఒక కోణం అయితే పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రయోజనం పొందడం రెండవ కోణం. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న దగ్గర నుంచీ ఆ రాష్ట్రంలో చోటు సంపాదించేందుకు బిజెపి ప్రయత్నిస్తూనే ఉన్నది. ముస్లిం ప్రయోజనాల పరిరక్షణ విషయంలో రాజీ లేని సెక్యులర్ వాదిగా ముద్ర పడిన మమత బిజెపిని గట్టిగా అడ్డుకుంటున్నారు. తాజాగా బిజెపి తలపెట్టిన రధయాత్రను అడ్డుకునే విషయంలో ఆమె చాలా పట్టుదలతో వ్యవహరించారు.
బెంగాల్లో కాలు మోపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బిజెపి ఓ బెంగాలీని భారతరత్నతో గౌరవించడం ద్వారా బెంగాలీల అభిమానం సంపాదించుకోవాలను కుంటున్నది. ప్రణబ్ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలన్న ప్రతిపాదన పట్ల మమత కూడ మొదట్లో సుముఖంగా లేని సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.
2014లో బిజెపి ఘనవిజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టినపుడు ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్నారు. ప్రధాని మోదీతో ఆయన సత్సంబంధాలే నడిపారు. 2017లో ప్రణబ్ పదవీకాలం ముగిసినపుడు మరో దఫా కొనసాగాల్సిందిగా ఆయనను కోరవచ్చునని బిజెపి నాయకత్వానికి అనిపించలేదు. పదవీ విరమణ చేసిన తర్వాత భారతరత్న ఇవ్వాలని అనిపించింది.
-సురయ్యా