న్యాయానికి ఒక్క పాదమైనా మిగిలివుందా అన్న అనుమానం ఒక్కోసారి వస్తుంది. అసలు న్యాయం అనేది ఒకటి వుందా అన్న ప్రశ్న కూడా ఒక్కోసారి ఉదయిస్తుంది. న్యాయం ఉండే వుంటుంది కాని అది కొందరికే ఊడిగం చేస్తుందని మాత్రం కొన్ని ఘటనలు చూస్తే రూఢిగా అర్థమవుంది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో జరిగిన రేప్ ఉదంతం మొత్తం దేశాన్నే కలవరపరుస్తోంది. పదిహేడేళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేశాడు ఒక బీజేపీ ఎమ్మెల్యే. అతని పేరు కులదీప్ సింగ్ సేన్గార్. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహానుభావుడు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని 2017 జూన్ నాలుగున బలవంతంగా లోబర్చుకున్నాడు. ఆ అమ్మాయి వెంటనే అతనిపై ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి మొదలైంది అసలు దుర్మార్గం. ఆ కులదీప్ మీద బాధితురాలు ఫిర్యాదు చేసిన వారంలోపే ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగింది. తర్వాత బాధితురాలి తండ్రి మీద అక్రమ ఆయుధాల చట్టం కింద కేసుపెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ అసహాయ తండ్రి జైల్లోనే చనిపోయాడు. మరి బాధితురాలు మాత్రం ఎందుకు బతికుండాలి? ఇక వేట మొదలైంది. అత్యంత దారుణమైన వేట. న్యాయం కోసం కింది కోర్టులన్నీ తిరిగింది. చివరికి తనకు ప్రాణ భయం వుందని ఆమె జూలై 12న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ పెట్టుకుంది. జూలై 17న గాని అది రిజిష్టర్ అవ్వలేదు. అది ప్రధాన న్యాయమూర్తి టేబుల్ మీదకు చేరుకోనే లేదు. అంతలోనే అంతా జరిగింది. జూలై 28న తన లాయర్ తో ఇద్దరు బంధువులతో కలిసి బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. బాధితురాలు, ఆమె లాయరూ కొన ఊపిరితో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ తర్వాత జూలై 30న ఛీఫ్ జస్టిస్ వద్దకు ఆమె అభ్యర్థన పత్రం చేరుకుంది. మరణభీతితో ఆమె చేసిన ప్రార్థన న్యాయమూర్తి ముందు నిలబడే సరికే అసలు పనిని కానిచ్చేశారు నిందితులు. తర్వాత కోర్టులు ఎంత వేగంగా స్పందిస్తే ఏముంది? జరగాల్సిన అన్యాయం జరిగేపోయింది.
ఇంతటి దు:ఖభరిత గాథ చదివాక దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ మీదే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది యావత్ స్త్రీ లోకానికే జరిగిన అన్యాయంగా కనిపిస్తోంది. రక్షకుడు కావాల్సిన వాడు, కీచకుడై ఒక ఆడపిల్లను చెరబట్టిన ఘాతుకమే కాదిది. మొత్తం స్త్రీలోకాన్నే భయభ్రాంతులకు గురిచేసే దారుణం ఇది. అతిపెద్ద ప్రజాస్వామిక దేశాన్ని ప్రపంచం బజారులోకి ఈడ్చి నవ్వులపాలు చేసిన దుర్మార్గమిది. బలవంతులదే రాజ్యం అన్న మాట చాలా బలంగా నిరూపిస్తున్నారు మన పాలకులు. దేశమంతా కాండ్రించి ఊసిన తర్వాత గాని బీజేపీ వారికి సిగ్గు రాలేదు. చివరికి కంటి తుడుపుగా అతగాడిని పార్టీ నుంచి బహిష్కరించారు. సమస్య ఇక్కడ పార్టీ కాదు. అలాంటి క్రూరమృగాలు ఎలా అందలాలెక్కుతున్నాయన్నదే ప్రశ్న. అంగబలం అర్థబలం వున్న వారు మదబలాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్న విష వాతావరణం చూసి భయం కలుగుతోంది. ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నా, ఏదో ఒకరోజు అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు దొరకలేదని బాఇజ్జత్ రిహా కర్ దియా జాతా హై అని ఆదరణీయ జడ్జిగారు అత్యంత సాదరంగా దోషిని వదిలేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. స్వేచ్ఛ అన్నది ఎవరి ఇంటికి కావలి కుక్కో మనం ఊహించుకోగలం. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఎవరికి రక్షాకవచాలుగా మారాయో, ఎవరికి అందని ద్రాక్షల్లా మారాయో ఊహించుకోగలం. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి ఆమె ప్రాణాలతో ఉన్నదో లేదో తెలియదు. ఆమె కూడా ఈ విషాద జీవితం నుంచి, ఇంత దుర్మార్గమైన లోకం నుంచి విడుదలై వెళ్ళిపోవచ్చు. దేవుడు కూడా ఆమెకు న్యాయం చేయలేకపోవచ్చు. దేవుళ్ళు కూడా ఎవరికి దాసులో మనకు తెలియనిదేముంది?
అప్పడప్పుడూ ఇలాంటి పాపాలను ఇంత నిస్సహాయంగా ఈ కళ్ళతో చూడాల్సి వస్తుందే అని బాధ కలుగుతుంది. ఏమీ చేయలేమా అని దు:ఖం వేస్తుంది. అసలు పేపర్లే చదవకుంటే..టీవీలే చూడకుంటే..ఏ వార్తలూ వినకుంటే కళ్ళతో పాటు మనసును కూడా మూసేసుకుంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. నిస్సహాయంగా నిలువునా నీరు కారిపోవడం తప్ప ఏం చేయగలం? చేయగలిగిన వారు దోషుల పక్షాన నిలబడుతున్నారు. ఏమీ చేయలేని వాళ్లం బాధితుల పక్షాన వుంటాం. బహుశా ఈ నిస్సహాయులే ఆకాశమంతా విస్తరించి నిప్పుల వానలు కురిసి సమస్త పాపాలనీ దగ్ధం చేసే రోజు వస్తుందనే నమ్ముదాం.
ఏదో ఒకరోజు ఆ రోజు వస్తుంది
చీకటి కళ్ళు చితికిపోయే రోజు
అన్యాయం అవని మీంచి అదృశ్యమయ్యే రోజు
కిరీటాలు గాల్లో కలసి..సింహాసనాలు మట్టిలో కలిసి
దుశ్శాసనులు..దుర్యోధనులు నేల మీద పొర్లిపొర్లి ఏడ్చే రోజు వస్తుంది
మనం తప్పక చూస్తాం..తప్పక చూస్తాం
డా.ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ