మొత్తం మీద ప్రధానమంత్తి నరేంద్ర మోదీ స్పందించారు. జార్ఖండ్ మూకహత్య మీద నిన్న రాజ్యసభలో నోరు మెదిపారు. తీరా చూస్తే అక్కడా రాజకీయ ప్రయోజనమే చూసుకున్నారు. జార్ఖండ్ హత్య తనను బాధ పెట్టిందని ఆయన అన్నారు. అయితే దానికి జార్ఖండ్ను ఎందుకు నిందిస్తారని ఆ వెంటనే ప్రశ్నించారు. మూకహత్యలకు జార్ఖండ్ కేంద్రంగా మారిందంటూ ఆ రాష్ట్రాన్ని నిందించకండి అంటూ ప్రతిపక్షాలకు హితవు చెప్పారు.
2016 మార్చి దగ్గర నుంచీ జార్ఖండ్ రాష్ట్రంలో 18 మంది మూక హత్యలకు గురయ్యారు. వారిలో 12 మంది ముస్లింలు. వీటిలో మెజారిటీ కేసుల్లో ఇంకా విచారణ పూర్తి కాలేదు. తాజాగా 24 ఏళ్ల తబ్రేజ్ అన్సారీని ఆ రాష్ట్రంలో కొట్టి చంపితే కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ మాట అన్నారు. జార్ఖండ్లో మూక హత్యలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేందుకు ఆయన ఆ విశేషణం వాడారు. నరేంద్ర మోదీకి అందులో తప్పు కనబడింది. ఎందుకంటే త్వరలో జార్ఖండ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సువర్ణావకాశాన్ని ఎలా వదులుకుంటారు? పైగా ఆయన మోదీ!
2014 ఎన్నికలలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగనన్ని సీట్లు సంపాదించుకుంది. ఆ తర్వాత గోరక్షక దళాల పేరుతో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, హర్యానా తదితర రాష్ట్రలలో అరాచకం ప్రబలిపోయింది. ప్రధాని మోదీ 2016 వరకూ నోరు విప్పలేదు. నోరు విప్పినపుడు కూడా ముస్లింలపై దాడులను ప్రత్యేకంగా ఖండించలేదు. ఇప్పుడు మళ్లీ నోరు విప్పారు. తబ్రేజ్ అన్సారీ హత్య వంటి మాటలకు అందని అమానుషాన్ని, జార్ఖండ్కు ‘అవమానా’న్ని ఒకే గాట కట్టారు.
లించింగ్ (lynching) అనే ఆంగ్ల పదం అర్ధాన్ని సరిగ్గా ప్రతిబింబించే తెలుగు పదం లేదు. అమెరికాలో పుట్టిన ఈ పదాన్ని ఒక హత్యకు వాడాలంటే అది మూక హత్య అయి ఉండాలి. అంటే అది చట్టం వెలుపల అమలయ్యే మూక న్యాయం అన్నమాట. అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగా జరగాలి. అక్కడున్న మూకలో కొంతమందన్నా అందులో పాలు పంచుకుంటారు. ఒకేసారి కత్తితో పొడిచో, తుపాకితో కాల్చో చంపరు. తీరిగ్గా హింసించి చంపుతారు. ఇండియాలో జరుగుతున్న మూక హత్యలన్నీ కొట్టి చంపడాలే. ఒక వ్యక్తిని చేతులతోనో, కర్రలతోనో ప్రాణాలు పోయేంతవరకూ కొట్టడం ఊహించుకోండి ఒకసారి.
https://youtu.be/nK55Fpvd7Bs
జార్ఖండ్లో తబ్రేజ్కు అమలయిన మూక న్యాయంలో ఒక ఘట్టం
తబ్రేజ్ను కరెంట్ స్తంభానికి కట్టేసి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అని అనిపించారు. తబ్రేజ్ మోటార్ సైకిల్ దొంగిలించాడన్న అనుమానంతో పట్టుకుని కట్టేశారు. ఇందులో చోరీ అనుమానం కన్నా అతను ముస్లిం కాబట్టే మూక న్యాయం అమలయిందని దీనిని బట్టి మనం నిక్షేపంగా నిర్దారణకు రావచ్చు. తబ్రేజ్ను స్తంభానికి కట్టేసి కొడుతున్నపుడు ఆ మూకలో సభ్యులే సెల్ఫోన్లో వీడియో తీశారు. తమ కిరాతకానికి సాక్ష్యం రికార్డు కావడాన్ని వారు అడ్డుకోలేదు గమనించండి. తబ్రేజ్పై తాము అమలు చేస్తున్న మూక న్యాయం దేశంలోని ముస్లింలందరికీ ఒక హెచ్చరికలా అందాలన్నది వారి ఉద్దేశ్యం. ఈ ఒక్క సందర్బంలోనే కాదు అన్ని సందర్భాలలోనూ ఇలాగే జరిగింది.
పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత కూడా తబ్రేజ్కు న్యాయం జరగలేదు. చూపించామంటే చూపించాం అన్నట్లు ఆసుపత్రిలో చూపించి తర్వాత బైక్ చోరీ కేసులో కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జైలుకు పంపింది. తబ్రేజ్ స్థితి దిగజారినపుడు మళ్లీ అసుపత్రికి తీసుకెళ్లారు. కానీ లాభం లేకపోయింది.
ప్రపంచ దేశాల్లో మతపరమైన స్వేచ్ఛ ఎలా ఉందన్న దానిపై అమెరికా ప్రతి ఏడాదీ ఒక నివేదిక విడుదల చేస్తుంది. ఇండియాలో మతస్వేచ్ఛకు ప్రమాదం ఎదురవుతోందంటున్న తాజా నివేదికను ఈ నెల 21వ తేదీన అమెరికా విదేశాంగ మంత్రి విడుదల చేసినపుడు తబ్రేజ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మూల జైలులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. తరతరాలుగా తన వంశీకులు ఉంటున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతనికి రక్షణ లేకుండా పోయింది. తన పొరుగు గ్రామం ప్రజలే అతనిని పట్టకుని చావచితకగొట్టారు. చట్టబద్ధ పాలనను అమలు చేయాల్సిన పోలీసు యంత్రాంగం కూడా అతనికి అండగా నిలవలేదు. తబ్రేజ్ ఆఖరికి దిక్కులేని చావు చచ్చాడు. ఇందులో మతం పాత్ర ఉందోలేదో మీరే నిజాయితీగా ఒక నిర్ధారణకు రండి.
అమెరికా నివేదిక పట్ల భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. మా దేశంలో మైనారిటీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందన్న విషయం తెలియదా అని హుంకరించింది. చాలుచాల్లే మీరా మాకు నీతులు చెప్పేది అని కళ్లెర్ర చేసింది. ఇండియాలో మైనారిటీల హక్కులకు రాజ్యాంగం పూచీ పడిందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. అసలు పేచీ వస్తున్నదే అక్కడ కదా? మైనారిటీలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుంపులు యధేచ్ఛగా కాలరాస్తుంటే రాజ్యం తమాషా చూస్తూ కూర్చోవడం పైనే కదా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నది?
ఉత్తరప్రదేశ్, దాద్రీలో ఫ్రిజ్లో మాంసం ఉన్నందుకు 2015 సెప్టెంబర్లో మహమ్మద్ అఖ్లఖ్ అనే కమ్మరిని మూక కొట్టి చంపింది. రెండేళ్ల తర్వాత ఆ కేసులోని రవి అనే నిందితుడు అనారోగ్యంతో మరణిస్తే మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్థానిక ఎంపి మహేష్ శర్మ అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. రవి మృతదేహంపై జాతీయ పతాకం కప్పిన అతని కుటుంబానికి ఆర్ధిక సహాయం వాగ్దానం చేశారు.
2017 ఏప్రిల్లో రాజస్థాన్లోని అల్వార్లో పెహ్లూఖాన్ అనే పశువుల వ్యాపారిని మూక కొట్టిచంపింది. అతనితో ఉన్న మరో ఆరుగురిని చితకబాదారు. అక్కడి బిజెపి ప్రభుత్వం దెబ్బలు తిన్నవారిపై కేసు పెట్టింది.
తబ్రేజ్ అన్సారీ పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాలేదు. తాను పని చేస్తున్న పూనాకు భార్యను తీసుకు వెళ్లేందుకు తబ్రేజ్ స్వగ్రమం వచ్చాడు
గత సంవత్సరం జనవరిలో జమ్ములోని కథువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికపై రోజుల తరబడి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జిషీటు వేయడం కష్టమైపోయింది. న్యాయవాదులే అడ్డం తగిలారు. చివరికి విచారణను పొరుగు రాష్ట్రమైన పంజాబ్కు బదిలీ చేయాల్సివచ్చింది. రేపిస్టులకు మద్దతుగా జాతీయ జెండాలతో జరిగిన ఊరేగింపులో ఇద్దరు బిజెపి మంత్రులు చౌదరి లాల్సింగ్, చంద్ర ప్రకాష్ గంగా పాల్గొన్నారు.
ఈ ఉదాహరణలు మచ్చుకి మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ప్రతిమూక హత్యకూ ప్రత్యంక్షంగానో పరోక్షంగానో మద్దతు లభించింది. మరి వాడెవడో అమెరికా వాడు చెప్పాడని కాదు గానీ మనకు మనం ఆత్మశుద్దితో ఆలోచిద్దాం. ఇండియాలో మత స్వేచ్ఛ లక్షణంగా ఉందా? దానికి వచ్చిన ప్రమాదమేమీ లేదా?
రెండవసారి మరింత ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదానికి ‘సబ్ కా విశ్వాస్’ అనే మాటను జోడించారు. అంటే సమాజంలో అందరి నమ్మకాన్నీ చూరగొంటారన్న మాట. జార్ఖండ్ మూకహత్యకు స్పందనగా ఆయన రాజ్యసభలో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఏమనిపిస్తోంది? ఆయన మాటలకు చేతలకూ పొంతన ఉందా?