ఏపి శాసన సభ టీడీపీ ఉప నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి అచ్చెన్న అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీలో ఏమోగానీ వైఎస్ఆర్ సీపిలో సెగ రేపింది.
సోమవారం నుండి జరిగే శాసన సభ బడ్జెట్ సమావేశంలో అచ్చెన్న వాగ్ధాటికి అధికార పక్షం సమాధానాలు చెప్పలేకే కక్షసాధింపులో భాగంగా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని టీడీపీ విమర్శించింది. దీనికి తోడు బీసీ నేతలను అణగదొక్కే కుట్ర అంటూ లేవనెత్తారు టీడీపీ నేతలు. ప్రభుత్వంపై బీసీ వర్గాలలో ఆగ్రహం తెప్పించేలా టీడీపీ నేతలు మాట్లాడారు. దీనితో అధికార వైఎస్ఆర్ సీపి తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా నలుగురు మంత్రులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే లు మీడియా ముందుకు వచ్చి టీడీపీ విమర్శలను తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు.
మంత్రులు మేకతోటి సుచరిత, జయరాం, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఫెయిర్ బ్రాండ్ ఆర్కె రోజా తదితరులు చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నిప్పులు చేరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక రేంజ్ లో టీడీపిపై విరుచుకుపడ్డారు. రోజా అయితే సినిమా స్టైల్ లో చేసిన వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయని అంటున్నారు. ముందుంది ముసళ్ల పండుగ అన్న సామెత మాదిరిగా ఇది ట్రయిలర్ మాత్రమే సినిమా ముందు ఉందని రోజా వ్యాఖ్యానించడం విశేషం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?