దీపావళి వచ్చేసింది. చిన్నా.. పెద్దా అందరిలో సంబరమే. టపాసులు కాల్చడం తప్ప మనసులో మరో ఆలోచన ఉండదు. ఈ నేపథ్యంలో టపాసులు కొనడం దగ్గర నుంచి.. వాటిని కాల్చడం వరకూ హడావిడే. గతంలో టపాసుల పొగ దోమలు, క్రిమి కీటకాలు పోతాయనే ఉద్దేశంలో ఇళ్లకు మంచింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్. కరోనా సోకి తగ్గినవారికి ఈ పొగ అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు దీపావళికి టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. ఏపీ ప్రభుత్వమూ అలెర్ట్ అయింది. జాగ్రత్తలు ఎలా పాటించాలి.. ఎలా పండగ నిర్వహించాలనే దానిపై ఉత్తర్వులు ఇచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఉత్తర్వుల అమలుపైనే సందేహాలు నెలకొన్నాయి.
ప్రజలకే బాధ్యత ఎక్కువ.. పాటిస్తారా..?
దీపావళి పండగ ప్రజలకు ఎంత సంబరమో.. వ్యాపారులకు అంత ఆనందం. ప్రతి ఏటా షాపులు పెట్టేందుకు పోటీ పడతారు. మరి.. ఈసారి కరోనా ఉంది. మరెంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం మాస్కులు పెట్టుకోవడమే మానేస్తున్నారు..! భౌతికదూరం సరేసరి. ఇప్పుడు దీపావళి టపాసుల అమ్మకం అంటే.. లైన్ లో నుంచుని రేషన్ సరుకులు తీసుకోవడం కాదు. షాపుల వద్ద ఎగబడిపోవడమే. టపాసుల కొనుగోళ్లకు ఆగేది ఉండదు. మరి కరోనా కట్టడి.. స్వీయ జాగ్రత్తలు ఆ సమయంలో ఎవరికీ గుర్తుకు రావు. టపాసులతో పొగ కాలుష్యం.. ఎవరికీ మంచిది కాదనే స్పృహా ఉండదు.. కరోనా వచ్చి తగ్గిన వారికి మరీ మంచిది కాదు అని అనిపించదు.. కాల్చేస్తారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. తగిన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే..
ప్రభుత్వం కట్టడి చేయాల్సింది ఇదే..!
ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో రాత్రి 8 నుంచి 10లోపు మాత్రమే టపాసులు కాల్చాలని పేర్కొంది. షాపుల నిర్వహణ మధ్య 10 అడుగుల దూరం ఉండాలని పేర్కోంది. పేలే టపాసులు కాకుండా గ్రీన్ క్యాకర్స్ మాత్రమే కాల్చాలని కూడా చెప్పింది. అయితే.. ఇవన్నీ ఆచరణలో సాధ్యమేనా. షాపులకు ఇచ్చే పర్మిషన్లు తగ్గించాలి. టపాసుల నిల్వ చేసే గౌడౌన్లు పరిశీలించాలి. గ్రీన్ క్యాకర్స్ మాత్రమే ఉంచి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న టపాసులను సీజ్ చేయాలి. రాజకీయ నాయకులే తమ వారితో షాపులు నిర్వహిస్తారు. నిబంధనలు పాటించడం అక్కడి నుంచే మొదలవ్వాలి. వీటన్నింటినీ పక్కాగా అమలు చేస్తేనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు న్యాయం జరిగేది. మరి ప్రజలు ఏం చేస్తారో.. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?