Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ Telangana Congress ‘దేశంలో కాంగ్రెస్ నందు తెలంగాణ కాంగ్రెస్ వేరయా..’ అని కొత్తగా రాజకీయ సామెత రాసుకోవాలేమో. చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అని నేతలు ఎంతగా గొంతెత్తి.. ఎలుగెత్తి చాటినా తెలంగాణ ప్రజల చెవికెక్కలేదు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ పార్టీ.. దేశంలో, ఏపీలో, తెలంగాణలో ఆదరణ కోల్పోయింది. ఏపీలో పరిస్థితి కాంగ్రెస్ కు తెలిసిపోయింది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితే అర్ధం కాకుండా ఉంది. ఇందుకు ఉదాహరణ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత పగ్గాలు చేపట్టే నాయకుడి అన్వేషణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో పేరున్న నాయకులు కొంతమందే ఉన్నారు. ఉన్న నాయకుల్లో పెద్దోళ్లే చాలామంది టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. మిగిలిన నాయకత్వంలో యూనిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానంకు టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తలనొప్పిగా మారింది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరిలో దాదాపు ఆయన పేరు ఖరారైందనే వార్తలు వచ్చాయి. అయితే.. సీనియర్లు తలోమాట తమ అభిప్రాయంగా చెప్పేసరికి పార్టీ సీనియర్లను కాదని రేవంత్ వైపు వెళ్లలేక ఇష్యూ సైలెంట్ అయిపోయింది. సాగర్ ఉప ఎన్నిక తర్వాతనైనా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావిస్తే అదీ జరగలేదు. మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది.
Read More: Etala Rajender: ఈటల చేరికను బీజేపీ లైట్ తీసుకుందా? అమిత్ షా, నడ్డా లేరెందుకు?
రేవంత్ రెడ్డితో సహా.. సీనియర్లు కొందరు ఢిల్లీలో మకాం వేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. మొన్నటి కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ చీఫ్ ను మార్చేశారు. కానీ.,. తెలంగాణలో మాత్రం ఆలోచిస్తున్నారు. అసలే పార్టీ పరిస్థతి బాగాలేని సమయంలో అంతో ఇంతో ఉనికి ఉన్న తెలంగాణ విషయంలో ఎవరూ హర్ట్ కాకుండా నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. సీనియర్లను కాదని రేవంత్ ఇవ్వలేక.. రేవంత్ వాయిస్ కాదనుకోలేక ఢిల్లీలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. అందుకే.. మరికొంత కాలం వేచి చూసే ధోరణిలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మరి.. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీని ముందుకు నడిపేది ఎవరో.. వేచి చూడాల్సిందే.