విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని గంటా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక గతంలో కూడా చెప్పానని గుర్తు చేశారు. విశాఖ ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయితే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటుగా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు, తమ పార్టీ అధినేత నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని గంటా స్పష్టం చేశారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు జ్యుడిషియరీ కేపిటల్ ఉండొచ్చన్నారు. అయితే సీఎం జగన్ ప్రకటనకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ కూడా రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఈ నెల 27న క్యాబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోకున్నారు.