న్యూఢిల్లీ: దాణా స్కాం కేసులలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే ఆయన వెంటనే రాజకీయాలు మొదలుపెడతారని సీబీఐ వాదించింది. అయితే, లాలూకు వేసిన శిక్ష 14 ఏళ్లే గానీ 25 ఏళ్లు కాదని, ఆయనేమీ పారిపోవడం లేదని లాలూ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. దానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సమాధానమిచ్చారు. ‘‘అది 25 ఏళ్లా.. 14 ఏళ్లా అనేది హైకోర్టు నిర్ణయిస్తుంది. రాజకీయ నాయకులపై కేసులు త్వరగా తేల్చాలని మేం హైకోర్టుకు చెప్పగలం’’ అన్నారు. పాతికేళ్ల జైలుశిక్షలో లాలూ ఇప్పటికి కేవలం రెండేళ్లే శిక్ష అనుభవించారు.
లాలూను బెయిల్ మీద విడుదల చేస్తే ప్రమాదం ఏముందని సిబల్ వాదించగా, ‘‘ప్రమాదం ఏమీ లేదు, మీరు దోషి అవ్వడం తప్ప. మేం బెయిల్ ఇవ్వగలమని అనుకోవడం లేదు. పిటిషన్ కొట్టేస్తున్నాం’’ అని తేల్చిచెప్పారు. లాలూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతి ఇవ్వకూడదని సీబీఐ వాదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు దేశం మొత్తాన్ని వణికించాయని, వైద్యపరమైన కారణాలు చూపించి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. ఆసుపత్రి స్పెషల్ వార్డు నుంచి కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారని కోర్టుకు సీబీఐ చెప్పింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?