అమరావతి: ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి సీఎం జగన్ పై ఫిర్యాదు చేశారు. సీఎం అక్రమార్జనపై అధ్యయనం చేయాలని కోరారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని, జగన్ రాజకీయ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.
అయితే, ఈ ఫిర్యాదును సచివాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది ఆయనకు సూచించారు. సీఎం జగన్ చెప్పినట్లు తాను చేసిన ఫిర్యాదుపై కూడా 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు. తనపై రూ.43 వేల కోట్ల అభియోగాలు పెట్టుకుని అవినీతిని అంతమొందిస్తానని సీఎం జగన్ ఎలా చెబుతారని వర్ల ప్రశ్నించారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. 14500 టోల్ ఫ్రీ నంబర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.