(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న జగన్ ప్రకటన చట్ట విరుద్ధమని అయన అన్నారు.
హైకోర్టు అమరావతి నుండి తరలించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాలను పునః సమీక్షించుకోవాలని కనకమేడల సూచించారు. అసలు జిఎస్ రావు కమిటీకి చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. అయిదు కోట్ల మంది ప్రజలతో చెలగాటం ఆడేలా జిఎన్ రావు కమిటీ నివేదిక ఉందని ఆయన విమర్శించారు.
బోస్టన్ కమిటీ ఎప్పుడు వేశారో ఎవరికీ తెలియదని అన్నారు. ఇప్పుడు కొత్తగా హైపవర్ కమిటీని వేశారన్నారు. హైపవర్ కమిటీ ఇంత వరకూ సమావేశం జరపలేదు కానీ కమిటీ సభ్యులు మాత్రం ఎవరికి వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ వేసిన కమిటీలకు చట్టబద్దత ఉన్నదా అని కనకమేడల ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల అభాసుపాలు అవుతుందని ఆయన అన్నారు.