రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ ఎదురు చూస్తుంది. రాష్ట్రంలో జిరిగే ప్రతి అంశాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తాయి ప్రతిపక్షాలు. ఈ సమయంలో తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సింది ప్రభుత్వం. అయితే.. రాష్ట్రంలోని ప్రతి అంశాన్ని రాజకీయం చేసేస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఇందుకు నిదర్శనంగా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శ ఇప్పుడు రాజకీయ కాకను రేపుతోంది. నిజానికి ఇటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తాయి.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..
అంతర్వేదిలో రథం దగ్దం ఘటన మతంతో ముడిపడి ఉన్న చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమయంలో అధికార పార్టీలో ఉండి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం తగనిపని. ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే చేశారు. సెప్టెంబర్ 9న ఆయన చేసిన ట్వీట్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలతోపాటు రథం దగ్దం ఘటనను కూడా ప్రస్తావించారు. ఇందులో ఏకంగా ‘అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు, ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు’ అని చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే.. వీటికి సాక్ష్యం లేదు. ఉంటే సీబీఐ ఎంక్వైరీ కాకుండా.. సీఎం ఆ ఆధారాలతో చర్యలు తీసుకునే వారు. ఇటువంటి ఆరోపణలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ.
గతంలో ఇటువంటి అంశాలపైనే చంద్రబాబుకు నోటీసులు..
ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తోంది.. న్యాయ వ్యవస్థపై నిఘా పెట్టింది అంటూ చంద్రబాబు ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. మరి రథం దగ్దం విషయంలో చంద్రబాబుపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డికి పోలీసులు నోటీసులు ఇస్తారా అనేది కీలకాంశం. దీనిని బట్టి సున్నితమైన అంశాలపై ఆచితూచి మాట్లాడాలి. స్పందించినా ముందుకు వెళ్లకూడదు. కానీ.. విజయసాయి రెడ్డి ఆరోపణల స్థాయి వ్యక్తిగతంగా వెళ్లిపోయింది. ఈ వ్యాఖ్యలతో పార్టీ చులకన అవుతుంది తప్పితే ఒనగూరే ప్రయోజనం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.