అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక బాధ్యత వహించి వెంటనే ఆయన అక్రమ కట్టడం నుండి నివాసాన్ని ఖాళీ చేయాలని ఆళ్ల డిమాండ్ చేశారు. అవసరమైతే ఆయనకు ఇళ్లు నిర్మించుకోవడానికి రాజధాని ప్రాంతంలోనే సెంటో, అర సెంటో తాను కొనుగోలు చేసి ఇస్తానంటూ ఆళ్ల వ్యాఖ్యానించారు. లింగమనేని గెస్ట్ హౌస్కు సంబంధించి గతంలో చంద్రబాబు, లింగమనేని రమేష్లు వివిధ న్యూస్ ఛానల్స్లో వెల్లడించిన వివరాలను ఆళ్ల ప్రదర్శించారు. నేడు మీడియా సమావేసంలో వీడియో ఆధారాలను చూపి మరీ ఆళ్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఈ ఇంటితో తనకు సంబంధం లేదనీ, లాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చామని గతంలో లింగమనేని రమేష్ స్వయంగా మీడియా చెప్పారని ఆళ్ల గుర్తు చేశారు. అదే విధంగా తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానిదేనని గతంలో చంద్రబాబు కూడా స్పష్టం చేశారని ఆళ్ల అన్నారు. గతంలో ఈ ఇంటితో సంబంధం లేదన్న లింగమనేని ఇప్పుడు నా ఇళ్లేననీ, అన్నీ అనుమతులు ఉన్నాయని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఆళ్ల అన్నారు.
చంద్రబాబు ఉంటున్న ఇళ్లు ఆయనదా, ప్రభుత్వానిదా అనేది లింగమనేని రమేష్ మరో సారి స్పష్టం చేయాలని ఆళ్ల డిమాండ్ చేశారు. తాను ఉంటోన్న ఇళ్లు ప్రభుత్వానిదని 2016 మార్చి ఆరున శాసన సభలోనూ చంద్రబాబు చెప్పారని ఆళ్ల గుర్తు చేశారు. సిఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని ఆళ్ల దుయ్యబట్టారు.
లింగమనేని రమేష్ను చంద్రబాబు భయపెట్టి రకరకాలుగా మాట్లాడిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయకపోవడం సరైన చర్య కాదనీ, ఇప్పటికైనా ఖాళీ చేయాలని ఆళ్ల డిమాండ్ చేశారు. గతంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చినా ఇళ్లు అక్రమమో సక్రమమో చంద్రబాబు చెప్పడం లేదని ఆళ్ల అన్నారు.
ప్రభుత్వ భవనమైనా ఎందుకు ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారని ఆళ్ల ప్రశ్నించారు. నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటోన్న ఇళ్లు తక్షణం ఖాళీ చేయాలని ఆళ్ల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్ట ప్రకారం అక్రమ ఇంటిని కూలగొట్టాలని సిఆర్డిఎ కమిషనర్ను కోరుతానని ఆళ్ల చెప్పారు. కరకట్ట మీద ఉన్న ఏ అక్రమ నిర్మాణాలనూ వదిలేది లేదని ఆళ్ల పునరుద్ఘాటించారు.
చంద్రబాబు సహా మరి కొంత మంది చట్ట పరంగా ఎంత మంది ఇంటి అద్దె తీసుకున్నారో అసెంబ్లీ సెక్రటరీని వివరాలు అడిగానని ఆళ్ల తెలిపారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకున్నారా అనే విషయం బయటపెట్టాలని ఆళ్ల అన్నారు.వైఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేవారు వాటికి ఆధారాలు చూపించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
చంద్రహబాబు అధికారంలో ఉండగా కరకట్ట పక్కన ఉన్నవన్నీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎందుకు ఆ పని చేయలేదని ఆళ్ల ప్రశ్నించారు. కరకట్ట నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షార్హులేనని ఆళ్ల స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?