ముంబై: చైనా దేశాన్ని వణికిస్తున్న ‘కరోనా వైరస్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి ఇండియాకు వ్యాపించింది. ముంబయిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులను కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారు. వీరిద్దరిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 26 మంది మృతి చెందారు. 800 మందిని ఈ వ్యాధి అనుమానితులుగా పేర్కొన్నారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని విమానాశ్రయ వర్గాలను ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేస్కర్ తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రైవేటు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కరోనావైరస్ ను ఎలా ఎదుర్కోవాలో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణాత్మక సూచనలు వచ్చాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి అని కస్తూర్బా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్యులు, చైనా నుండి తిరిగి వచ్చే ప్రయాణికులకు కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు పంపమని కోరినట్లు పౌర విమానయాన సంస్థ అధికారి తెలిపారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా సహా వివిధ విమానాశ్రయాలలో 12 వేల మంది ప్రయాణికులను బుధవారం వరకు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
శ్వాస వ్యవస్థపై ‘కరోనా వైరస్’ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరింది. మరో 830 మంది ఈ వ్యాధి బాధితులుగా మారినట్లు చైనా ప్రభుత్వ అధికారులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో 177 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ కొరియా, జపాన్ లో మరో రెండు కేసులు నమోదైనట్లు శుక్రవారం ధృవీకరించింది. వైరస్ ను మొదటిసారి గుర్తించిన వుహాన్ నగరంలో మరో వెయ్యి మంది అనుమానితులకు పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. చైనాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితిగా మాత్రం పరిగణించలేదు. వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే వుహాన్ నగరంలో ప్రజారవాణాను నిలిపివేశారు. పలు నగరాల్లో రాకపోకలు, సాధారణ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. దీంతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్, హుయాంగ్ గాంగ్, ఖియాన్ జింగ్ తదితర నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది.