(న్యూస్ అర్బిట్ డెస్క్)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 59 స్థానాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
పలు పోలింగ్ బూత్ ల వద్ద టిఎంసి, బిజెపి కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి.
జాదవ్ పూర్ లో బిజెపి మండలాధ్యక్షుడి వాహనాన్ని ధ్వంసం చేశారు. తమ పార్టీ నాయకులకు రక్షణ లేకుండాపోయిందని బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
టిఎంసికి చెందిన ఒక కార్యకర్త ముసుగేసుకుని బూత్లోకి ప్రవేశించారని బిజెపి అభ్యర్థి అనుపమ్ హజ్రా ఆరోపించారు.
తమ పోలింగ్ ఏజెంట్లపైనా వారు దాడికి దిగినట్లు ఆరోపించారు.
భరత్పూర నియోజకవర్గంలో టిఎంసీ, బిజెపి కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకోగా పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి.
పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ ఏడు విడతల పోలింగ్ సందర్భాలలోనూ పశ్చిమ బెంగాల్ లో ఘర్షణలు జరిగాయి.
యూపిలోని చందౌలీ పరిథిలోని తారా జీవన్పూర్ గ్రామస్థులు స్థానిక అధికారులపై మండిపడ్డారు. కొందరు బిజెపికి చెందిన వ్యక్తులు తమను బెదిరించి తమ చేతి వేళ్లకు బలవంతంగా సిరా రాసి చేతిలో 500 రూపాయలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వారు ఆరోపించారు.
పోలింగ్ బహిష్కరించిన చందోరా ఓటర్లు. .
బిహార్లోని చందోరా గ్రామస్థులు పోలింగ్ను బహిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్గిరి తాలూకాలో ఉన్న ఈ గ్రామంలో రోడ్ల దుస్థితిపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, తాము ఓటేసేది లేదంటూ ఎన్నికల అధికారులపై దాడికి దిగారు. ఈవిఎంలను పగలగొట్టారు.