(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారతదేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక శాతం మంది దగ్గర ఉన్న డబ్బు… దేశంలో అట్టడుగున్న ఉన్న 70 శాతం మంది ప్రజల (95.3 కోట్ల మంది) దగ్గర ఉన్న డబ్బు కంటే… నాలుగు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. భారత్లోని బిలియనీర్ల మొత్తం డబ్బు… కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే ఎక్కువని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. దావోస్లో 50వ వార్షిక ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) జరుగుతున్న సందర్భంగా… టైమ్ టు కేర్ పేరుతో ఓ అధ్యయన రిపోర్టును సోమవారం విడుదల చేసింది ఆక్స్ఫామ్ సంస్థ. ఆ రిపోర్ట్ ప్రకారం… ప్రపంచంలో 2,153 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద ఈ ప్రపంచంలోని 60 శాతం మంది ప్రజల (460 కోట్ల మంది) దగ్గర ఉన్న సంపద కంటే ఎక్కువగా ఉందని ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ఓ భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ధనవంతులూ, పేదవాళ్ల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. గత దశాబ్ద కాలంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదని ఆక్స్ఫామ్ సంస్థ ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులు ఎన్ని జరిగినా… పేద, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించనంతవరకూ అలాంటివి జరిపి లాభం లేదన్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చెప్పారు.
సోమవారం నుంచీ ఐదు రోజులపాటూ జరిగే సదస్సులో ఇలాంటి అంశాల్ని జనరల్గానే చర్చిస్తారు. ఏటా పేదలు మరింత పేదలవుతుంటే… ధనవంతులు మరింత కుభేరులు అవుతున్నారు. 2019లో ఈ వైరుధ్యం మరింత ఎక్కువగా కనిపించిందని ఆ రిపోర్ట్ పేర్కొంది. దాదాపు అన్ని ఖండాల్లో అశాంతి, అల్లకల్లోల సమస్యలు తలెత్తుతున్నాయి. అవినీతి పెరుగుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతుంటే సమాన్య ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
మన దేశంలో 63 మంది బిలియనీర్లు ఉన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ రూ.24,42,200 కోట్ల కంటే… ఆ 63 మంది సంపాదనే ఎక్కువని తేలింది. మన దేశంలో ఓ టెక్నాలజీ కంపెనీ సీఈఓ సెకండ్కి రూ.106 సంపాదిస్తుంటే… ఆ వ్యక్తి 10 నిమిషాల్లో సంపాదిస్తున్నదానికంటే… మన దేశంలో ఓ కూలీ… ఏడాదిలో సంపాదించే దానికంటే ఎక్కువేని ఆ రిపోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలంటోంది ఆక్స్ఫామ్ సంస్థ.
దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 3.26 బిలియన్ల గంటలు ఎలాంటి భత్యం లేకుండా పని చేస్తున్నారు. ఈ లెక్కన వారంతా కలిసి ఏడాదికి సంపాదించగలిగే రూ.19 లక్షల కోట్ల మొత్తం భారత విద్యాశాఖ బడ్జెట్ కంటే 20 రెట్లు ఎక్కువ అని పేర్కొంది. జీడీపీలో రెండు శాంతంగా ఉన్న సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల్ని నేరుగా అనుమతించడం వల్ల 2018 సవంత్సరంలో కోల్పోయిన 11 మిలియన్ల ఉద్యోగాల్ని తిరిగి సృష్టించవచ్చని తెలిపింది. ప్రభుత్వాలు ఏ కొద్ది మందికో అనుకూలంగా ఉండే నిర్ణయాలు కాకుండా… ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. మొత్తం మీద భారత దేశంలోని కోటీశ్వరుల సంపద అంతా చూస్తే ఇది ఒక పూర్తి సంవత్సరపు బడ్జెట్ కన్నా అధికమేనని తేలింది.