ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధిపతి అబూ బకర్ అల్ బాగ్దాదీ ఐదేళ్ల తర్వాత మళ్లీ వీడియోలో కనిపించాడు. ఆ సంస్థ విడుదల చేసిన ఒక వీడియోలో అతడు మాట్లాడుతున్నట్లుంది. అది ఎక్కడ షూట్ చేశారో చెప్పలేదు గానీ, గత వారం శ్రీలంకలో జరిగిన దారుణ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావిస్తున్నట్లు మాత్రం ఉంది. అలాగే బఘౌజ్ కోసం చేసిన యుద్ధం ముగిసిందని అతడు చెబుతున్నట్లుంది. కాళ్లు మడుచుకుని పద్మాసనం వేసుకుని ఒక పరుపు మీద కూర్చుని ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అవతలివాళ్ల ముఖాలు మాత్రం బ్లర్ చేశారు. ‘‘దేవుడు మనల్ని జీహాద్ చేయమని చెప్పాడు గానీ గెలవాలని మనను ఆదేశించలేదు’’ అని బాగ్దాదీ అందులో చెప్పాడు.
వీడియోలో ముఖం కనిపించని మరో వ్యక్తి ఏప్రిల్ 21 నాటి శ్రీలంక దాడుల గురించి ప్రస్తావించి, బఘౌజ్ లో మరణించిన తమ సోదరులకు ప్రతీకారంగా ఇది చేసినట్లు చెప్పాడు. పాశ్చాత్య దేశాలపై చేస్తున్నది సుదీర్ఘ యుద్ధంలో భాగమని, తమ సభ్యుల మరణానికి ఇస్లామిక్ స్టేట్ ప్రతీకారం తీర్చుకుంటుందని అతడు చెప్పాడు. ఈ యుద్ధం తర్వాత మరిన్ని వస్తాయన్నాడు. వీడియోలో వ్యక్తికి చాలా పొడవు గెడ్డం ఉంది. దానికి హెన్నాతో రంగు వేసుకున్నట్లు కనిపించింది. అతడు మధ్యమధ్యలో కాస్తా ఆగుతూ నెమ్మదిగా మాట్లాడాడు.
వీడియోలో ఉన్న వ్యక్తి బాగ్దాదీయేనని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూపు తెలిపింది. దాంతోపాటు ఈ గ్రూపులోని ఇరాకీ నిపుణుడు హిషమ్ అల్ హషెమీ కూడా నిర్ధారించారు. 47 ఏళ్ల వయసున్న బాగ్దాదీ, 2014లో తొలిసారి, చివరిసారి ప్రజలకు బహిరంగంగా కనిపించాడు. అక్కడే అతడు ఇస్లామిక్ ఖలీఫా సామ్రాజ్యాన్ని ప్రకటించాడు. అప్పటినుంచి పలుసార్లు అతడిని చంపినట్లు లేదా గాయపరిచినట్లు కథనాలు వచ్చాయి. గత ఆగస్టులో చివరిసారి అతడి గొంతును అతడి మద్దతుదారులు విడుదల చేశారు.