న్యూఢిల్లీ: ఇండియా గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంటాడుతూ వెళ్లిన భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానాన్ని కోల్పోయామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఆ విమానంలో ఉన్న పైలట్ కూడా మిస్సయ్యాడన్నారు.
ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ తమ ఆధీనంలోనే ఉన్నాడని పాకిస్థాన్ అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో రవీశ్ కుమార్ తాజాగా చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్తో కలిసి రవీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బుధవారం ఉదయం కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చేందుకు పాకిస్థాన్ యుద్ధ విమానాలు ప్రయత్నించగా.. భారత వాయుసేన వాటిని తిప్పికొట్టాయని తెలిపారు.
ఈ క్రమంలోనే మిగ్-21 విమానాన్ని కోల్పోయామని వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాన్ని భారత్కు చెందిన రెండు మిగ్-21 విమానాలు వెంబడించాయని, అందులో ఒకటి పాక్ యుద్ధ విమాన్ని కూల్చివేసిందని చెప్పారు. అయితే, మరోటి మాత్రం మిస్సయ్యిందని వివరించారు. మిగ్ పైలట్ తమ అదుపులో ఉన్నాడని పాక్ తెలిపిందన్నారు.
భారత వింగ్ కమాండర్పై పాక్లో దాడి
భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్పై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడి జరిగింది. మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయే సమయంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. పాక్ అక్రమిత కాశ్మీర్లోని ఓ నదీ పరీవాహక ప్రాంతంలో ఆయన నేలపైకి దిగినట్లు తెలుస్తోంది.
అయితే, అప్పటికే విమానం కూలిపోవడం గమనించిన సైనికులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన ఒంటిమీద ఎలాంటి గాయాలూ లేవు. కానీ, పాకిస్థాన్ సైనికులు వచ్చే లోపే స్థానికులు కొందరు అభినందన్పై దాడికి పాల్పడ్డారు. సైనికులు వచ్చిన తర్వాత కూడా వారు దాడి చేశారు. అయినా, అభినందన్ వారికి ఏ మాత్రం బెదరలేదు.
ఆ తర్వాత అభినందన్ని అక్కడ్నుంచి పాక్ సైనిక స్థావరానికి తీసుకెళ్లారు. అక్కడా కూడా ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన వీడియోలో ఆయన చేతులు వెనక్కి కట్టివేసి ఉండగా, ముఖానికి తీవ్రగాయాలై ఉన్నాయి. అభినందన్పై స్థానికులు దాడి చేస్తున్న వీడియో, పాక్ సైనికులు ప్రశ్నిస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. శత్రుచెరలో ఉన్నామన్న భయం ఆయనలో ఏమాత్రం కనిపించకపోవడం గమనార్హం.
తాజా పరిస్థితి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ అదుపులోకి భారత పైలట్ ఉన్నాడని పాక్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. పైలట్ను సురక్షితంగా తీసుకొచ్చే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది.