నేనెప్పుడూ వాళ్లను అలాగే చూశా
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
న్యూఢిల్లీ: బీజేపీని తాను ఎన్నడూ మతతత్వ పార్టీగానే చూసినట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. 1998 నుంచి 2009 వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) కూడా ఒక భాగస్వామ్య పార్టీయే. అయితే అప్పటికి వాళ్ల మతతత్వం కొంత తక్కువగా ఉండేదని పట్నాయక్ చెప్పారు. కంధమాల్ ప్రాంతంలో 2009లో మతఘర్షణలు చెలరేగినప్పుడు బీజేపీ అసలురంగు తనకు తెలిసిందని అన్నారు. జాతీయ మీడియా చానల్ ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. ఆ అల్లర్ల తర్వాతే బీజేపీతో తన సంబంధాలు తెగిపోయాయన్నారు. విశ్వహిందూ పరిషత్ నాయకుడి హత్య తర్వాత స్థానిక క్రిస్టియన్లను కొంతమంది తరిమి తరిమి కొట్టారు.
ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకపోయినా, బీజేడీ మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యూహాత్మక మద్దతు ఇస్తూనే ఉంది. ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఒకవేళ బీజేపీకి తగినంత మెజారిటీ రాకపోతే తమను ఆదుకునే ప్రాంతీయ పార్టీలలో అదొకటని నమ్ముతున్నారు. మరోసారి మద్దతు ఇవ్వాల్సి వచ్చినపుడు ‘మతతత్వం’ అడ్డుపడుతుందా అని ఆయనను అడిగితే, పడుతుందనే సమాధానమిచ్చారు.
2014 ఎన్నికల్లో ఒడిషాలోని 21 స్థానాలకు గాను బీజేడీ 20 చోట్ల, బీజేపీ ఒకచోట గెలిచాయి. కానీ ఈసారి బీజేపీ అక్కడ తన బలం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నాయక్ ఒకప్పటి సన్నిహితుడైన జై పాండా.. గత నెలలో బీజేపీలో చేరారు. 71 ఏళ్ల నవీన్ బాబు ఆరోగ్యంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కలహండి జిల్లాలో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒడిశా ప్రభుత్వం 10 అడుగుల నడకకు 10 నిమిషాలు తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలను శత్రువులుగా చూడనని.. కానీ వాళ్లు తన స్నేహితులు కూడా కారని నవీన్ అన్నారు. రెండింటిలో ఎన్డీయే బాగా ప్రమాదకరమని చెప్పారు. ఇద్దరిలో ఎవరితోనైనా కలుస్తామన్నది అనుమానమేనని తెలిపారు.