ఢిల్లీ, మార్చి 4 : భారత వాయుసేన జరిపిన దాడిలో ఉగ్రవాదులు వందల మంది చనిపోయారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పాక్పై భారత్ జరిపిన మెరుపు దాడిలో 250 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ప్రకటించారు. కానీ వాయుసేనాధిపతి బిఎస్ ధనోవా మాత్రం ఈ దాడిలో ఎంత మంది చనిపోయారో చెప్పలేమని అంటున్నారు. దాడి వార్త మొదట వెలువడినపుడు 300 మంది మృతి చెందినట్లు అన్ని మీడియా సంస్థలూ ఇచ్చాయి. అధికార వర్గాల లీకు ఇందుకు ఆధారం.
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన గత నెల చివరి వారం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలని లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమయ్యాయి. కాగా ఎంత మంది ఉగ్రవాదులు మరణించారన్న విషయంపై బిజెపి నాయకులు ఒక విధంగా ..వాయుసేన అధికారులు మరో విధంగా చెప్పటం గమనార్హం. దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు.
ఆదివారం గుజరాత్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, ‘ఊరీ ఉగ్రవాద దాడి అనంతరం మన బలగాలు పాకిస్థాన్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. మన జవాన్ల మృతికి సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పూల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించకపోవచ్చునని అందరూ భావించారు. కానీ, ఏం జరిగింది? ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 13 రోజులకే మన ప్రభుత్వం వైమానిక దాడులు నిర్వహించి 250మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది’ అని అన్నారు.
సోమవారం కొయంబత్తూర్లో జరిగిన మీడియా సమావేశంలో బిఎస్ ధనోవా మాట్లాడుతూ.. ‘ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలపైనే మా దృష్టి ఉంటుంది. అంతేగానీ చేసిన దాడుల్లో ఎంతమంది చనిపోయారు అన్నది ఎయిర్ఫోర్స్ లెక్కించదు. ఈ దాడిలో మా లక్ష్యం నెరవేరింది. బాలాకోట్ శిబిరంలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యను వెల్లడించడం వంటివి ప్రభుత్వమే చూసుకుంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు.