మీడియా ప్రాపగాండా సాధనాలుగా మారిపోతున్న వైనం గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతున్నది. అయితే తెలుగు మీడియా తీరుతెన్నుల గురించి పెద్దగా చర్చ లేదు. ప్రతి మీడియా సంస్థకూ ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఉందన్న వాస్తవంతో ప్రజలు రాజీ పడిపోవడమే ఇందుకు కారణం అయ్యుండాలి.
వాస్తవాలను నిగ్గుతేల్చి ప్రజలకు అందించాల్సిన మీడియా తెలుగు రాష్టాలలో ఎలా పని చేస్తున్నదీ అర్ధం చేసుకునేందుకు ఈ రోజు వచ్చిన రెండు వార్తలు ఉపకరిస్తాయి.
టిడిపికి సాంకేతిక సేవలు అందిస్తున్న ఐటి గ్రిడ్ అనే సంస్థ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రజల వ్యక్తిగత సమాచారం సంపాదించిందని లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై తెలంగాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న హైదరాబాద్లో దీనిపై కాస్త డ్రామా నడిచింది. దీనిపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్త కాస్త అటూఇటుగా సక్రమంగానే ఉన్నప్పటికీ తెలంగాణా పోలీసులు ఎజెండాతో పని చేస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా రిపోర్టు చేశారు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ కేసుతో తెలంగాణా పోలీసులకు ఏమిటి సంబంధం అంటూ మరో ప్రత్యేక కథనం ఇచ్చారు. దానితో ఆ అభిప్రాయం బలపడేలా చేశారు.
ఇక సాక్షి దినపత్రిక ఎపిలో భారీ డేటా స్కామ్ అంటూ పోలీసుల దర్యాప్తులో ఉన్న అంశంపై ప్రధాన వార్త రాసి ముద్దాయి టిడిపి అని ఢంకా బజాయించింది. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా నెగ్గడానికి అధికార టిడిపి కుతంత్రాలు అంటూ పూర్తిగా ప్రాపగాండా జర్నలిజానికి తెర లేపింది. ఈనాడు దినపత్రిక మాత్రం హైడ్రామా అన్న శీర్షిక కింద జరిగిందేమిటో వివరించింది. ఫిర్యాదుదారు లోకేశ్వరరెడ్డి వైసిపి ఐటి విభాగానికి చెందిన వ్యక్తి అంటూ ఆంధ్రజ్యోతి రాయగా, ఆయన ఫలానా సంస్థకు చెందిన వ్యక్తి అని మాత్రమే సాక్షి రాసింది.
మరో వార్త ఈరోజు అన్ని పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. దొంగ వోట్ల తొలగింపు కోసం ఆన్లైన్లో కుప్పల కొద్దీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామనీ, ఆధారాలు ఉంటేనే తొలగిస్తామనీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. ఈనాడు ఆయన చెప్పిన మాటలను యధాతధంగా రిపోర్టు చేసింది. దానిక అదనంగా మీ వోటు భద్రమో కాదో చూసుకోండంటూ ప్రజలను అప్రమత్తం చేసే ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది.
ఇదే విషయంలో టిడిపి వోట్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ అంటూ వైసిపిను ముద్దాయి చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రధాన వార్త రాసింది. సాక్షి దినపత్రిక ద్వివేదీ చెప్పిన మాటలు విడిగా ఇచ్చి పక్కా స్కెచ్తోనే టిడిపి దరఖాస్తులు అంటూ అధికారపార్టీని ముద్దాయి చేస్తూ ప్రత్యేక కథనం వెలువరించింది. అటు ఆంధ్రజ్యోతి కానీ, ఇటు సాక్షి కానీ తమ నిర్ధారణకు ఆధారాలు ఏమిటో తెలుపలేదు.