అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు. నవరత్నాల అమలులో క్షేత్రస్థాయిలో ఎక్కడా పొరబాటు జరగకుండా చూడాలని చెబుతూ, జిల్లా కలెక్టర్లకు తన ఆలోచన విధానాలను వివరించారు.
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పని చేయాలని జగన్ స్పష్టం చేశారు. మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అని ప్రతి క్షణం గుర్తు ఉంచుకోవాలని జగన్ సూచించారు. రెండు పేజీల నవరత్నాల మానిఫెస్టో ప్రతి కలెక్టర్, ప్రతి హెచ్ఒడి, ప్రతి మంత్రి వద్ద ఉండాలని జగన్ చెప్పారు. మానిఫెస్టో అన్నది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాలని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మనది అన్న భావన ఉండాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలని జగన్ అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనకు ప్రజలు 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపి స్థానాలు ఇచ్చారు. 50శాతం ఓటు షేర్తో ఇంత భారీ మ్యాండెట్ ఇచ్చారని జగన్ అన్నారు. దీన్ని ఎప్పుడూ మరచిపోకూడదని జగన్ అన్నారు.
ఎమ్మెల్యేలు మీ వద్దకు వస్తే వారికి గౌరవం ఇవ్వాలి, వారు ప్రజా సమస్యలను మీ వద్దకు తీసుకువస్తే వాటికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని జగన్ ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన పనులు ఎవరు చెప్పినా చేయవద్దని జగన్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు ఎవరు చెప్పినా ఈ ప్రభుత్వం సమర్థించదని జగన్ స్పష్టం చేశారు.
ఆర్థికంగా అణగారిన వర్గాలు ఎదిగేలా మన పాలన ఉండాలని జగన్ అన్నారు. నవరత్న పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడవద్దు, ప్రతి ఒక్కరికి లబ్ది అందాలి అని జగన్ సూచించారు. అధికారపక్షం ఎమ్మెల్యే ఇవ్వవద్దు అని సూచించినా వారు అర్హులైతే మంజూరు చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అర్హతే గీటురాయి అని పేర్కొన్నారు.
ఎన్నికలు అయ్యే వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తరువాత అందరూ మన వాళ్లే, ప్రభుత్వ స్కీమ్లు అందరికి అందాలి అని జగన్ అన్నారు.
గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా ఉండాలనే విషయాలను జగన్ వివరించారు.ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిజాయితీగా పని చేయాలి. గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకూ ఎక్కడా అవినీతి ఉండకూడదు. ప్రతి అడుగులోనూ పారదర్శకత కనబడాలి అని జగన్ స్పష్టం చేశారు
ప్రజలకు హక్కుగా అందించాల్సిన సేవలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం లంచాలు తీసుకోవడం గానీ, చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం గానీ చేయకూడదని జగన్ స్పష్టం చేశారు.
సమావేశంలో డిప్యూటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రసంగం పూర్తి పాఠం కొరకు కింద క్లిక్ చేయండి